Iran-Israel: మాతో ఘర్షణలకు దిగొద్దు.. ఇజ్రాయెల్ కు హెచ్చరికలు జారీ చేసిన ఇరాన్

ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ భీకర దాడులకు పాల్పడింది. మిస్సైల్స్ వర్షం కురిపించింది. దాదాపు 200 వరకు బాలిస్టిక్‌ క్షిపణులను ప్రయోగించింది.

Update: 2024-10-02 04:43 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ భీకర దాడులకు పాల్పడింది. మిస్సైల్స్ వర్షం కురిపించింది. దాదాపు 200 వరకు బాలిస్టిక్‌ క్షిపణులను ప్రయోగించింది. వాటిని ఇజ్రాయెల్‌ అడ్డుకునేందుకు ప్రయత్నించింది. కాగా.. ఈ ఉద్రిక్తతల మధ్య ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌ ఇజ్రాయెల్‌కు కఠినమైన హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్‌తో యుద్ధానికి వ్యతిరేకంగా ఉన్నామని ఇజ్రాయెల్ ప్రజలు నెతన్యాహుకి తెలియజేయాలని అన్నారు. ‘ఇరాన్‌ ప్రయోజనాలు, పౌరుల రక్షణలో భాగంగానే దాడులు ప్రారంభించాం. ఇరాన్‌ యుద్ధానికి పాల్పడే దేశం కాదని నెతన్యాహుకు తెలియజేయండి. మీరు చూసిందంతా ఒకవైపు మాత్రమే. ఇరాన్‌తో ఘర్షణలకు దిగొద్దు’ అని మసూద్‌ పెజెష్కియాన్‌ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా హెచ్చరించారు.

దాడి ముగిసింది

అంతేకాకుండా, ఇజ్రాయెల్‌పై తమ దాడి ముగిసిందని ఇరాన్‌ వెల్లడించింది. ‘ఇజ్రాయెల్‌ ప్రతీకార దాడులకు పాల్పడకుంటే మా చర్య ముగిసినట్లే. ఒకవేళ ఇజ్రాయెల్‌ తిరిగి దాడులు ప్రారంభిస్తే మా రియాక్షన్ మరింత తీవ్రంగా, శక్తిమంతంగా ఉంటుంది.’ అని ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాక్చి ఎక్స్‌లో వెల్లడించారు. ఇకపోతే, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలపై ఐక్యరాజ్యసమతి భద్రతామండలి బుధవారం సమావేశం నిర్వహించనుంది. ఈసందర్భంగా తక్షణ కాల్పుల విరమణకు పిలుపునిచ్చింది. ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ చేస్తున్న దాడులు అసమర్థమైనవని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ మండిపడ్డారు. అదేవిధంగా ఇరాన్‌కు వ్యతిరేకంగా తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు యూఎస్‌ వెనకాడబోదని ఇజ్రాయెల్‌కు తమ మద్దతుని ప్రకటించారు. ఇరాన్‌ క్షిపణుల దాడులను విజయవంతంగా ఎదుర్కొంటున్నామని ఇజ్రాయెల్‌ సైన్యం బుధవారం తెలిపింది. అలాగే దాడులకు ప్రతీకార చర్యలు తప్పవని ప్రకటించింది.


Similar News