లోయలో పడ్డ బస్సు.. 24 మంది దుర్మరణం

సౌత్ అమెరికా దేశమైన పెరూలో ఘోర రోడ్డు ప్రమాదం

Update: 2023-09-19 01:57 GMT

దిశ, వెబ్‌డెస్క్: సౌత్ అమెరికా దేశమైన పెరూలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఒక బస్సు ప్రమాదవశాత్తూ అదుపుతప్పి  200 మీటర్ల లోతులో ఉన్న లోయలో పడిపోయింది. ఈ ఘటనలో బస్సులోని 24 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. వీరిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. ఈ ప్రమాదంలో మరో 35 మంది తీవ్రంగా గాయలవ్వగా.. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

హుయాన్యాయో నుంచి హువాంటాకు బస్సు వెళుతుండగా ఆండెస్ పర్వతాల వద్ద అదుపుతప్పి లోయలో పడిపోయింది. సమాచారం అందుకున్న పోలీస్ అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. మృతులు, క్షతగాత్రులను హుటాహుటిన అంబులెన్స్‌లో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే గత నెల ఇదే ప్రాంతంలో జరిగిన బస్సు ప్రమాదంలో 13 మంది మృతి చెందారు. ఇప్పుడు అదే స్థలంలో మరో రోడ్డు ప్రమాదం చోటుచేసుకోవడంతో అధికారులు చర్యలు చేపడుతున్నారు.


Similar News