ఏఐతో తెలంగాణను గ్లోబల్ లీడర్ గా నిలబెడతాం : మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు

సర్కారులోని సకల విభాగాల్లో, సర్వ పద్ధతుల్లో ఏఐ సేవలతో ముందుకు వెళతామని.. ఆ దిశగానే అడుగులు వేస్తామని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు పేర్కొన్నారు.

Update: 2024-09-06 16:42 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : సర్కారులోని సకల విభాగాల్లో, సర్వ పద్ధతుల్లో ఏఐ సేవలతో ముందుకు వెళతామని.. ఆ దిశగానే అడుగులు వేస్తామని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికీ కొత్త సాంకేతికతలతో తయారయ్యే ఆవిష్కరణల ప్రతిఫలం అందాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు. హెచ్ఐసీసీలో జరిగిన రెండు రోజుల గ్లోబల్ ఏఐ సమ్మిట్ కు శుక్రవారం మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గ్లోబల్ ఏఐ సమ్మిట్ తో తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధికి ప్రోత్సాహం లభించిందన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెండు వైపుల పదును ఉన్నటువంటి కత్తిలాంటిడని, అద్భుతమైన ప్రగతితోపాటు కఠిన సవాళ్లను కూడా ఎదుర్కొవాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ఆర్థికాభివృద్ధి కోసం ఏఐ ఆధారిత సాంకేతికతతోపాటు పారదర్శక, నైతిక ప్రమాణాలున్న ఏఐపై దృష్టి కేంద్రీకరిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలోని అన్ని రంగాల్లో ప్రజాస్వామ్యయుత ఏఐ సేవలను అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని చెప్పారు.

ఏఐని వినియోగించుకొని తెలంగాణ గ్లోబల్ లీడర్ గా ఎదిగేలా చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. ఏఐకి సంబంధించి పలు ప్రాథమిక ప్రమాణాలపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించిందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఏఐ పవర్డ్ గవరెన్స్ దృష్టి కేంద్రీకరించాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఇందులో భాగంగా మొదట ఒక శాఖలో ఏఐ ఆధారిత వరిపాలనను అవలభించబోతున్నట్టు తెలిపారు. విద్య, హెల్త్ కేర్, వ్యవసాయం, ఐటీ వంటి శాఖల్లో దీన్ని తీసుకురానున్నామని ఆయన వివరించారు. తర్వాత ఏఐ రెడీ డేటాసెట్స్ పై దృష్టి సారించడంతోపాటు, ఏఐ స్కిల్డ్ పై పని చేస్తామన్నారు. స్కిల్ యూనివర్సిటీని దీనిపై బోధనలు సాగుతాయని వివరించారు. తెలంగాణ హైదరాబాద్ లో అనేక అంతర్జాతీయ కంపెనీలో స్థానిక ఉద్యోగులు వనిచేస్తున్నారని, వారు తమ నైపుణ్యాన్ని మరింతగా మెరుగువర్చుకోవాల్సిన అవసరం ఉండని గుర్తు చేశారు. అందులోభాగంగానే ఏఐపైనే రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా ఫోకస్ చేస్తుందని మంత్రి శ్రీధర్ బాబు చెప్పుకొచ్చారు. సమీప భవిష్యత్తులో ఏ రంగంలోనైనా ప్రపంచానికి అవసరమైన నైపుణ్యాన్ని అందించగల శక్తిగా ఎదగాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. అన్ని రంగాల్లో సాంకేతికత అభివృద్ధి కోసం సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రవేశపెట్టనున్నట్టు మంత్రి తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం ఏర్పాటు చేసే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా ఎన్నో స్టార్టప్ లకు ప్రోత్సాహం అందించే అవకాశం ఉంటుందన్నారు. దాంతోపాటు సైబర్ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్ వంటి అంశాల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఏర్పాటు చేయడం ద్వారా అద్భుతమైన ఆవిష్కరణలను వెలుగులోకి తీసుకురావచ్చన్నారు. మూలాల్లో కూడా ఏఐ సేవలు అందుబాటులోకి రావడం ద్వారా అందరికీ నైపుణ్యం లభిస్తోందని తెలిపారు. కొత్త టెక్నాలజీ సేవలను ప్రజాస్వామ్యయుతంగా అన్ని రంగాలను అందించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఏ కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినా కొన్ని భయాలను నెలకొంటాయని, ఏఐతో పేద, మధ్య తరగతి ప్రజలకు ఏ విధంగా లాభం జరుగుతుందనే అనుమానాలూ ఉన్నాయని వెల్లడించారు. అందుకే తమ ప్రభుత్వం ప్రస్తుత సాంకేతికత ఫలాలను ప్రతి ఒక్కరికీ అందేలా నిర్మాణాత్మకమైన పాలసీ రూపొందిస్తామని తెలిపారు. అందులో భాగంగా సదస్సు క్యాప్షన్ యే అందరికీ ఏఐ అనే నినాదంతో ప్రారంభించామని స్పష్టం చేశారు.

ఎథికల్ ఏఐ ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఎథికల్ ఏఐతో ఎలాంటి సమస్యను తత్తకూడదనే ఉద్దేశంతో డిజిటల్ గవర్నర్స్ ఫ్లాట్ ఫామ్ అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం యంగ్ ఇండియన్స్ సమయమని, రాష్ట్ర ప్రభుత్వం యువత ఉజ్వల భవిష్యత్ కోసం పలు అవకాశాలు కల్పిస్తుందని చెప్పారు. రాష్ట్రంలోని 5 వేల ప్రభుత్వ పాఠశాలల్లో సమగ్రమైన ఏఐ కర్రీకులం తీసుకురాబోతున్నామని చెప్పారు. దీని ద్వారా 20 వేల ఉపాధ్యాయులు, 5 లక్షల మంది విద్యార్థులపై ప్రభావం చూపనున్నడని తెలిపారు. ఫిన్లాండ్ ఏఐ ఎడ్యూకేషన్ మోడుల్స్ స్ఫూర్తిగా తీసుకుని ఈ వద్దతిని అవలంభించబోతున్నామని వివరించారు. రాష్ట్రంలో ఏఐ శిక్షణను ఇంగ్లీష్ తోపాటు తెలుగులోనూ అందిస్తామన్నారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తున్న ఏఐ సిటీ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ పై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నామని వ్యాఖ్యానించారు. ఎయిరోస్పేస్, ఫైనాన్స్, డ్రైవింగ్ ఇండస్ట్రీలో కూడా ఏఐ ఆధారిత సేవలను ఉపయోగించుకునేందుకు సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉండటం తెలంగాణ ప్రత్యేకత అంటూ ఆయన అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 70 శాతం కంపెనీలు వారి ఐటీ బడ్జెట్లో 20 శాతానికిపైగా ఏఐ ఆధారిత డిజిటల్, ఎమెర్జింగ్ టెక్నాలజీ కోసం కేటాయిస్తున్నాయని, తెలంగాణ రాష్ట్రం కూడా అదే విధానాన్ని అవలభిస్తోందని స్పష్టం చేశారు. ప్రపంచ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేదికపై తెలంగాణ ఏర్పాటు చేసుకున్న స్థానానికి ఈ గ్లోబల్ ఏఐ సమ్మిట్ నిదర్శనమని సంతోషం వ్యక్తం చేశారు. కాగా, ఈ ఏఐ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొన్న ప్రతినిధులకి, ఏఐ లెర్నింగ్ యాస్పిరెంట్స్ కి మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. 


Similar News