మహాగణపతి నిమజ్జనానికి సర్వం సిద్దం

ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

Update: 2024-09-16 17:13 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంగళవారం మధ్యాహ్నం మహాగణపతి గంగమ్మ ఒడికి చేరనున్నారు. నిమజ్జనం ఏర్పాట్లలో భాగంగా సోమవారం ఉదయం ఖైరతాబాద్ గణనాథుడి వద్ద కర్రల తొలగింపు పనులు ప్రారంభమయ్యాయి. ఆదివారం నుంచే దర్శనానికి భక్తులకు అనుమతి నిరాకరించారు. నాలుగు వైపులా బారికేడ్లును పోలీసులు ఏర్పాటు చేశారు. ట్యాంక్‌బండ్ వద్ద గణేష్ నిమజ్జన కార్యక్రమం కొనసాగుతోంది. హుస్సేన్ సాగర్ చుట్టూ భారీగా క్రేన్లు ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా, జలవిహార్, బేబీ వాటర్ పాండ్ వద్ద క్రేన్లు ఏర్పాటు చేశారు. హుస్సేన్ సాగర్ చుట్టూ మెుత్తంగా 31 క్రేన్లు ఏర్పాటు చేశారు. క్రేన్ నంబర్ 4 వద్ద ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం జరుగనుంది. ఉదయం 6.30గంటలకు శోభయాత్ర ప్రారంభమై రెండు గంటల్లోనే నిమజ్జనం పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ, పోలీసు శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. 700 మంది పోలీసుల భ్రదత మధ్య శోభయాత్ర సాగనుంది. 56 సీసీటీవీ కెమెరాలతోపాటు ప్రధాన రహదారిపై కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు.

బాలాపూర్ గణేషుని శోభయాత్రకు 220 మంది పోలీసులతో భ్రదత ఏర్పాటు చేశారు. 30 సీసీకెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు. వేలం పాట అనంతరం ఉదయం 9 గంటలకు శోభయాత్ర ప్రారంభం కానుంది. సుమారు 16 కిలోమీటర్ల ప్రయాణించి ఎన్టీఆర్ మార్గ్ కు చేరుకుంది. ఈనెల 7వ తేదిన ప్రారంభమైన వినాయక చవితి వేడుకలు మంగళవారంతో ముగియనున్నాయి.ఈ కార్యక్రమానికి 25వేల మందితో భద్రత ఏర్పాట్లు చేశారు. ఒక్క హుస్సేన్ సాగర్ చుట్టూనే 3వేల మంది పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు.

బడా గణేష్ ఆదాయం రూ.కోటిపైనే...

ఖైరతాబాద్ మహాగణపతి హుండీలో విరాళాల వర్షం కురిసింది. ఎన్నడూ లేనంత స్థాయిలో భారీగా హుండీ ఆదాయం వచ్చింది. కేవలం హుండీ కానుకల ద్వారానే రూ.70 లక్షల ఆదాయం వచ్చినట్లు అధికారులు సోమవారం వెల్లడించారు. ఇక మహా గణపతికి సంబంధించిన హోర్డింగ్లు, ప్రకటనల ద్వారా మరో రూ.40 లక్షలు ఆదాయం సమకూరినట్లు చెప్పారు. దీనికితోడు ఆన్‌లైన్ ద్వారా విరాళాల సేకరణ జరిగింది. అంటే.. ఈసారి ఖైరతాబాద్ మహా గణపతికి రూ.కోటికిపైనే ఆదాయం వచ్చిందని అధికారులు చెబుతున్నారు. హుండీ లెక్కింపును తొలిసారిగా సీసీ కెమెరాల పర్యవేక్షణలో జరపడం విశేషం.


Similar News