ది డైనమిక్ లీడర్ నూకల నరేష్ రెడ్డి ఇక లేరు.!

నూకల నరేష్ రెడ్డి.. రాష్ట్ర రాజకీయాల్లో ఈ పేరు తెలియని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు.

Update: 2024-10-05 03:57 GMT

దిశ, మరిపెడ : నూకల నరేష్ రెడ్డి.. రాష్ట్ర రాజకీయాల్లో ఈ పేరు తెలియని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. 40 సంవత్సరాల రాజకీయ అనుభవం.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదలుకొని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో తనదైన పాత్ర పోషించాడు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షతో 2010లో కేసీఆర్‌తో కలిసి తన ప్రయాణాన్ని కొనసాగించాడు . మారుతున్న రాజకీయ పరిస్థితుల దృశ్య గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో చేరాడు.

కుటుంబ నేపథ్యం.!

నూకల రఘునాధ రెడ్డి, మనోరమ దంపతులకు నరేష్ రెడ్డి 1951లో జన్మించాడు. కాగా ఇతనికి భార్య రజినమ్మతో పాటు కుమారులు అనిరుద్ రెడ్డి, అభినవ్ రెడ్డిలు సంతానం. ప్రస్తుతం ఈయన 73 సంవత్సరాలు పూర్తి చేసుకొని గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో శుక్రవారం సాయంత్రం 05.42 నిముషాలకు తుది శ్వాస విడిచారు. ఈయనకు వ్యవసాయం అంటే చాలా మక్కువ. అందులో భాగంగా తన సొంత గ్రామమైన పురుషోత్తమ గూడెంలో సుమారుగా 300 ఎకరాల భూమి కలదు. కాగా తన వ్యవసాయ క్షేత్రానికి "ఏరువాక"అని కూడా పిలుస్తారు.

నెరవేరని ఎమ్మెల్యే "కల"

జనరల్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసినా నూకలకు కాలం కలిసి రాలేదు. 1989లో హైకమాండ్ టికెట్ ఇచ్చినప్పటికీ జిల్లా రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఆ టికెట్ రెడ్యా నాయక్‌కు వెళ్లిందని ప్రచారంలో ఉంది. దీంతో టికెట్ రాకపోవడంతో ఆయన ఇండిపెండెంట్‌గా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచాడు. ఆ తర్వాత 1999 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. తప్పని పరిస్థితిలో వర్ధన్నపేట నియోజకవర్గంలోని రాయపర్తి మండల జడ్పిటీసీగా 2000 నుంచి 2005 సంవత్సరం వరకు పదవిలో ఉన్నాడు. అనంతరం 2009లో ఎస్టీ రిజర్వుడ్ కావడంతో పోటీలో పాల్గొనే పరిస్థితి లేకపోయింది. దీంతో 2010 మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరి క్రియాశీలక పాత్ర పోషించారు. అనంతరం మారుతున్న రాజకీయ పరిణామాలు దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది.

రాజకీయ దురంధరుడు.!

రాజకీయాల్లో గెలుపు ఓటములు ఏ విధంగా ఉన్నప్పటికీ రాజకీయ చాణక్యుడుగా నూకల పేరు సంపాదించాడు. 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నాయకుడు యువతను రాజకీయాల్లోకి ప్రోత్సహించడంలో ప్రముఖ పాత్ర పోషించడానే చెప్పాలి. ప్రస్తుతం వారి శిష్యులుగా ఎంతో మంది పదవులు అనుభవిస్తున్నారు.

యువతకు ప్రోత్సాహం.!

చదువు, క్రీడల పట్ల ఆసక్తి కనబరిచే యువతకు నూకల అపన్న హస్తం అందించేవాడు. ఇందులో భాగంగా ‘స్నేహ యూత్‌’ని స్థాపించడం జరిగింది.

ప్రముఖుల సంతాపం, శనివారం అంత్యక్రియలు.!

నూకల మృతి పట్ల రాజకీయాలకు అతీతంగా పలువురు సంతాపం ప్రకటించారు. ఆయన స్వస్థలమైన మరిపెడ మండలంలోని పురుషోత్తమ గూడెం గ్రామంలోని ఏరువాక వ్యవసాయ క్షేత్రంలో ప్రజల, అభిమానుల సందర్శనార్థం ఆయన పార్థివదేహాన్ని ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఉంచుతారాని, అనంతరం అంత్యక్రియలు జరుగుతుంది కుటుంబ సభ్యులు తెలిపారు.


Similar News