చేపల పెంపకానికి ప్రత్యేక కార్యాచరణ - మంత్రి సీతక్క..

ములుగు జిల్లాలో సమృద్ధిగా చెరువులు, కుంటలు, సరస్సులు పెద్దగా ఉన్నాయని చేపల పెంపకానికి జిల్లా ప్రాంతం ఎంతగానో ఉపయోగపడుతుందని, మత్స్యకారులను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు పోతుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా శాఖ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు.

Update: 2024-10-04 16:10 GMT

దిశ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లాలో సమృద్ధిగా చెరువులు, కుంటలు, సరస్సులు పెద్దగా ఉన్నాయని చేపల పెంపకానికి జిల్లా ప్రాంతం ఎంతగానో ఉపయోగపడుతుందని, మత్స్యకారులను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు పోతుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా శాఖ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. శుక్రవారం ములుగు మండలం జాకారం గ్రామంలోని ఊర చెరువులో చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్, మత్స్యకార సహకార సంఘాల సంస్థ చైర్మన్ మెట్టు సాయికుమార్ లతో కలిసి చేప పిల్లలను చెరువులో వదిలారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ముదిరాజ్ కులస్తులను అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోవడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని, దీనిలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చెరువులో చేపలను పెంచడానికి చేప పిల్లలను ప్రభుత్వం పూర్తి సబ్సిడీతో పంపిణీ చేస్తున్నదని అన్నారు. చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఒక పండుగలా జరుపుతున్నదని, జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవతో అధిక మొత్తంలో చేపలు పెంపకం చేయడానికి ప్రభుత్వం పూర్తిస్థాయిలో చేప పిల్లలను పంపించేసిందని అన్నారు.

జిల్లాలోని గిరిజన ప్రాంతాలలో గిరిజనులు చెరువులలో కుంటలలో చేపలు పెంచడానికి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసి ఇప్పటికే చేప పిల్లలను పంపించేసింది అని అన్నారు. ఎదుగుతున్న నాయకులను ఏ తరహాలో చూస్తారో అదే తరహాలో చేపలను పెంపకం చేయాలని, పెరిగిన చేపలను అమ్మకం చేసి మత్స్యకారులు ఆర్థికంగా బలోపితం కావాలని కోరారు. వచ్చే సంవత్సరం జూలై, ఆగస్టు మాసంలలో చేప పిల్లల కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతుందని మంత్రి హామీ ఇచ్చారు. మత్స్యకారుల కోసం మండల, జిల్లా కేంద్రాల్లో భవన నిర్మాణాల కోసం ప్రణాళిక సిద్ధం చేశామని, చేపల వేట కోసం వెళ్లిన మృత్యువాత పడిన మత్స్యకారులను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటున్నదని అన్నారు. గత ప్రభుత్వం మత్స్యకారులను ఆదుకోవడంలో విఫలమైందని, ముదిరాజులు రాజకీయంగా ఎదగడానికి ఎంపీ, ఎమ్మెల్యే సీట్లను కేటాయించి సభలకు పంపించిందని సీతక్క అన్నారు. ఈ కార్యక్రమంలో ములుగు తహశీల్దార్ విజయ భాస్కర్, ఎంపీడీవో రామకృష్ణ, మత్స్యశాఖ అధికారి అవినాష్, మత్స్యకార కమిటీ సభ్యులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.


Similar News