తెలంగాణ సచివాలయం ఎదుట ఉద్రిక్తత

గత నాలుగు రోజుల నుంచి గ్రూప్-1 అభ్యర్థులు హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతూనే ఉన్నారు.

Update: 2024-10-19 10:55 GMT

దిశ, వెబ్ డెస్క్: గత నాలుగు రోజుల నుంచి గ్రూప్-1 అభ్యర్థులు హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతూనే ఉన్నారు. ఈ క్రమంలో శుక్రవారం అశోక్ నగర్ లో నిరసన చేస్తున్న అభ్యర్థులను పోలీసులు రోడ్లపై ఉరికించి కొట్టారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ క్రమంలో కొందరు అభ్యర్థులు తమకు మద్దతుగా నిలవాలని కేంద్ర మంత్రి బండిని కోరారు. దీంతో పోలీసులు లాఠీ చార్జ్ ను ఖండించడమే కాకుండా ఈ రోజు నిరసనలో పాల్గొన్నారు. జీవో 29 వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. "చలో సచివాలయం"కు పిలుపు ఇచ్చారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు బండిని ట్యాంక్ బండ్ సమీపంలో అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. అప్పటికే వందల సంఖ్యలో గ్రూప్-1 అభ్యర్థులు సచివాలయం వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణ నెలకొంది. ఈ క్రమంలో సచివాలయం అన్ని గేట్లను మూసివేసిన పోలీసులు.. పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. దీంతో సచివాలయం వద్దకు వేల సంఖ్యలో చేరుకున్న గ్రూప్-1 అభ్యర్థులు ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సచివాలయం ఎదుట బైఠాయించిన గ్రూప్‌-1 అభ్యర్థులను అరెస్ట్ చేశారు. దీంతో ఒక్కసారిగా అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.


Similar News