అఖిల పక్షానికి రెడీ అవుతున్న సర్కార్.. బీఆర్ఎస్‌ను ఇరుకున పెట్టడమే ప్లాన్

త్వరలో మూసీ పరిరక్షణ, చెరువుల కబ్జాల తొలగింపుపై అఖిలపక్ష సమావేశం నిర్వహించేందుకు ప్రభుత్వం రెడీ అవుతున్నది.

Update: 2024-10-08 02:25 GMT

దిశ,తెలంగాణ బ్యూరో: త్వరలో మూసీ పరిరక్షణ, చెరువుల కబ్జాల తొలగింపుపై అఖిలపక్ష సమావేశం నిర్వహించేందుకు ప్రభుత్వం రెడీ అవుతున్నది. దసరా పండుగ తర్వాత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో సెక్రెటేరియట్ లేదా ప్రజాభవన్‌లో ఆల్ పార్టీ మీటింగ్‌కు ప్లాన్ చేస్తున్నారు. స్వయంగా భట్టి అన్ని పార్టీల అధ్యక్షులను మీటింగ్ రావాలని లేఖలు రాయనున్నట్టు తెలుస్తున్నది. ఈ సమావేశంలో పార్టీల అభిప్రాయాలు, సూచనలు, అభ్యంతరాలు తీసుకున్న తర్వాత యాక్షన్ ప్లాన్ రెడీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది.

ఆల్ పార్టీ మీటింగ్ తర్వాత మరింత దూకుడు

మూసీ నది పరివాహక ప్రాంతంలోని ఆక్రమణలు, ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని చెరువుల కబ్జాల తొలగింపు విషయంలో విపక్షాల అభిప్రాయాలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. కబ్జాలు ఎలా తొలగించాలి? ఏ మేరకు పరిహారం ఇవ్వాలి? యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండాలి? అనే అంశాలపై రాజకీయ పార్టీల అభిప్రాయాలు, సలహాలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నది. అయితే విపక్షాలు ఇచ్చిన సలహాలు ఆమోదం యోగ్యంగా ఉంటే, తన యాక్షన్‌ప్లాన్‌లో మార్పులు, చేర్పులు చేసేందుకు సర్కారు రెడీగా ఉన్నట్టు తెలుస్తున్నది. ఒకవేళ అన్ని పార్టీలు వ్యతిరేకించినా అనుకున్న షెడ్యూల్  ప్రకారం ఆక్రమణల తొలగింపు విషయంలో ముందుకెళ్లాలని సర్కారు ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. కబ్జాల తొలగింపు విషయంలో ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందనే విమర్శలను చెక్ పెట్టేందుకు ఈ మీటింగ్‌కు రేవంత్ సర్కారు ప్లాన్ చేసినట్టు తెలుస్తున్నది.

బీఆర్ఎస్‌ను ఇరుకున పెట్టే ప్లాన్

ఆల్ పార్టీ భేటీకి రావాలని అన్ని పార్టీల అధ్యక్షులకు భట్టి విక్రమార్క స్వయంగా లేఖలు రాయనున్నారు. సెక్రెటేరియట్ లేదా ప్రజాభవన్‌లో జరిగే సమావేశంలో పార్టీల​ అభిప్రాయాలను వీడియో రికార్డింగ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఎందుకంటే సమావేశంలో ఒకటి, బయట మరో తీరుగా విపక్షాలు వ్యవహరించొద్దని ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఆల్ పార్టీ మీటింగ్‌కు ముందు మూసీ నదిలోని కబ్జాల తొలగింపు విషయంలో అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయాలు, సీఎం హోదాలో కేసీఆర్, మంత్రిగా కేటీఆర్ మాట్లాడిన వీడియోలను అధికారికంగా బహిర్గతం చేయనున్నట్టు తెలిసింది. దీంతో అధికారంలో ఉన్నప్పుడు గులాబీ లీడర్లు ఏ విధంగా వ్యవహరించారు?ఇప్పుడు ఏ విధంగా మాట్లాడుతున్నారు? అనేది ప్రజలను వివరించేందుకు సిద్ధం అవుతున్నట్టు సమాచారం.

కేసీఆర్ మీటింగ్ వచ్చేనా?

ప్రభుత్వం నిర్వహించనున్న ఆల్ పార్టీ మీటింగ్‌కు మాజీ సీఎం కేసీఆర్ వస్తారా?లేదా? అనే ఉత్కంఠ నెలకొన్నది. కేసీఆర్ వచ్చి సలహాలు, సూచనలు ఇస్తే బీఆర్ఎస్ గ్రాఫ్ పెరిగే అవకాశం ఉంటుంది. డుమ్మా కొట్టడమో.. లేక తన తరుఫున మరొకరిని పంపినా కేసీఆర్ ఇరుకున పడే ప్రమాదం ఉంది. ఎందుకంటే సీఎం హోదాలో ఉన్నప్పుడు కేసీఆర్ మూసీ నదిలోని కబ్జాలు తొలగించేందుకు అన్ని పార్టీలు సహకరించాలని అప్పీల్ చేశారు. అలాంటి వ్యక్తి ఆల్ పార్టీ మీటింగ్‌కు రాకపోతే ఆయన్ను కాంగ్రెస్ మరింత ఇరుకున పెట్టే అవకాశం కనిపిస్తున్నది.


Similar News