శరవేగంగా స్కిల్ యూనివర్సిటీ.. ప్రతిపాదన వచ్చిన 24 గంటల్లోనే నిర్ణయం

రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం తరఫున కసరత్తు మొదలైంది.

Update: 2024-07-08 23:36 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం తరఫున కసరత్తు మొదలైంది. యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలంటూ సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఈ నెలాఖరులో (జులై 23) జరిగే అసెంబ్లీ సమావేశాలకు ముందే స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు అవసరమైన స్పష్టమైన ప్రతిపాదనలతో నివేదిక సమర్పించాలని పరిశ్రమల శాఖ, విద్యా శాఖ అధికారులతో పాటు పారిశ్రామిక రంగ ప్రముఖులకు సూచించారు. వాటిని పరిశీలించి ఇరవై నాలుగు గంటల్లో ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. వివిధ రంగాలకు చెందిన పారిశ్రామిక ప్రముఖులు, ప్రభుత్వ అధికారులతో గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీలో స్కిల్ డెవెలప్‌మెంట్‌పై సోమవారం మధ్యాహ్నం సమావేశం నిర్వహించిన సందర్భంగా పై ఆదేశాలు ఇచ్చారు.

ఈ సమావేశానికి హాజరైన వివిధ రకాల పరిశ్రమలకు చెందిన ప్రతినిధులతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి తదితరుల నుంచి స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించి అభిప్రాయాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత సామాజిక పరిస్థితులకు అనుగుణంగా చదువుకున్న చదువుకు, లభించే ఉపాధికి మధ్య లింకు ఉండాలని, ప్రతీ కోర్సు ఉపాధి కల్పనకు దోహదపడాలని భావిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లోక్‌సభ ఎన్నికలకు ముందే స్కిల్ యూనివర్శిటీ, నాలెడ్జి సెంటర్ ఏర్పాటుపై సుదీర్ఘంగా సమీక్షించారు. ప్రతీ జిల్లా కేంద్రంలో ఒక స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఉండాలని, నియంత్రణకు స్కిల్ యూనివర్శిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. దీనికి కొనసాగింపుగా ఈ సమావేశం జరగడం గమనార్హం.

గచ్చిబౌలిలో ప్రస్తుతం ఉన్న ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ప్రాంగణంలోనే స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే బాగుంటుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. దీంతో అటు ఐటీ కంపెనీలతో పాటు ఇటు పరిశ్రమలన్నింటీకీ అందుబాటులో ఉంటుందని, ఈ ప్రాంగణంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు ఉన్న అవకాశాలతో పాటు ప్రతికూల అంశాలపై ఆరా తీశారు. స్వయంగా ఆ ప్రాంగణంలో ఉన్న అనుకూల పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రస్తుతం ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) బోర్డు నిర్వహణ పరిధిలో పనిచేస్తున్నట్లుగానే స్కిల్ యూనివర్శిటీకి కూడా అలాంటి వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. ఆ వ్యవస్థ పటిష్టంగా ఏర్పడేంతవరకు ఇప్పుడు ఈ సమావేశానికి హాజరైన ప్రతినిధులను తాత్కాలిక (అడ్‌హక్) బోర్డుగా భావించాలని సీఎం రేవంత్ నిర్ణయం తీసుకున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న స్కిల్ యూనివర్సిటీలో ఎలాంటి కోర్సులుండాలి... ఎలాంటి పాఠ్యాంశాలు ఉండాలి... సిలబస్ రూపకల్పన ప్రాతిపదిక ఎలా ఉండాలి?... పరిశ్రమల అవసరాలు ఎలా ఉన్నాయి?... ఈ కోర్సులు కంప్లీట్ చేసిన తర్వాత ఉపాధి అవకాశాలు ఎలా ఉంటాయి?... వీటన్నింటికి అనుగుణంగా ప్రతిపాదనలు ఉండాలని సీఎం పేర్కొన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు ఉండేందుకు ఎలాంటి నైపుణ్యాలపై (స్కిల్స్) కోర్సులు నిర్వహించాలనేది తొలుత అధ్యయనం చేయాలని సూచించారు. అధునాతన పరిజ్ఞానం అందించేలా ఈ స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు. ఈ నెల చివర్లో బడ్జెట్ సమావేశాల్లోపే ప్రతిపాదనలు అందాలని కోరుకుంటున్నందున దానికి తగినట్లు నిర్ణీత గడువు పెట్టుకొని వాటిని రూపొందించాలన్నారు. కేవలం 15 రోజుల వ్యవధే ఉన్నందున ప్రతీ ఐదు రోజులకోసారి సమావేశం కావాలని సీఎం వారికి దిశానిర్దేశం చేశారు.

స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు, ప్రాజెక్టు రిపోర్టులను తయారు చేసేందుకు ఆయా రంగాల్లో నిపుణులైన ఒక కన్సల్టెంట్‌ను నియమించుకోవాలని ముఖ్యమంత్రి నొక్కిచెప్పారు. యూనివర్సిటీ వ్యవహారాలకు పరిశ్రమల శాఖ నోడల్ డిపార్టుమెంట్‌గా వ్యవహరిస్తుందని వివరించారు. ఈ యూనివర్సిటీని ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటు చేయాల్సి ఉంటుందా?... లేక ప్రభుత్వమే పూర్తి బాధ్యతలు నిర్వహించేలా ఉండాలా?... ప్రత్యామ్నాయంగా మరేదైనా విధానాన్ని అనుసరించాలా?... తదితర అంశాలను కూడా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ఆర్థికపరమైన అంశాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో, కరిక్యులమ్, కోర్సులకు సంబంధించి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో చర్చించాలని చెప్పారు. సమావేశానికి ముందే ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీలో నిర్మిస్తున్న కన్వెన్షన్ సెంటర్‌ను ముఖ్యమంత్రి పరిశీలించారు. దాదాపు ఇరవై నిమిషాల పాటు అక్కడ కలియదిరిగి అందులో ఉండే సదుపాయాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

రాష్ట్ర పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ జయేష్ రంజన్, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, సీఎం స్పెషల్ సెక్రెటరీ అజిత్‌రెడ్డి, ఇన్వెస్ట్ మెంట్స్ ప్రమోషన్ స్పెషల్ సెక్రెటరీ విష్ణువర్ధన్‌రెడ్డి, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ఛైర్మన్ సతీష్‌రెడ్డి, భారత్ బయోటెక్‌కు చెందిన హరి ప్రసాద్, ‘క్రెడాయ్’ ప్రెసిడెంట్ శేఖర్‌రెడ్డి, ‘ఐ ల్యాబ్స్’ శ్రీనిరాజు తదితరులంతా ఈ సమావేశంలో పాల్గొని ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా వారి అభిప్రాయాలను అందించారు. ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీని పరిశీలించిన తర్వాత సిబ్బందితో కలిసి గ్రూప్ ఫొటో దిగారు.


Similar News