విశాఖ ఉక్కు పరిశ్రమ స్థాపన కోసం చేసిన త్యాగాలను మరచిపోవద్దు: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు, విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో పూర్తిస్థాయి ఉత్పత్తి సామర్థ్యంతో ప్లాంట్‌ రన్‌ చేయాలని కోరుతూ అగనంపూడి నుంచి గాజువాక వరకు మానవహారం నిర్మించారు.

Update: 2024-10-06 17:04 GMT

దిశ, వెబ్‌డెస్క్: విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు, విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో పూర్తిస్థాయి ఉత్పత్తి సామర్థ్యంతో ప్లాంట్‌ రన్‌ చేయాలని కోరుతూ అగనంపూడి నుంచి గాజువాక వరకు మానవహారం నిర్మించారు. అనంతరం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాన్‌ను స్టీల్‌ప్లాంట్‌ పోరాట కమిటీ నేతలు కలిశారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ జరగకుండా చూడాలని డిప్యూటీ సీఎం వినతి పత్రం అందజేశారు. అలాగే స్టీల్‌ప్లాంట్‌ నిధుల కోసం కేంద్రంపై ఒత్తిడితేవాలని కార్మిక సంఘాల నేతలు కోరారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కార్మిక నేతలకు కీలక సూచనలు చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం 32 మంది బలిదానాలు, 16 వేల మంది నిర్వాసితుల త్యాగాలు, 24 వేల ఎకరాల భూ సేకరణతో ఏర్పాటైన పరిశ్రమ విశాఖ స్టీల్ ప్లాంట్ అని.. ఈ పరిశ్రమ కోసం అంతమంది చేసిన త్యాగాలను ఎవరూ మరచిపోకూడదని.. వారి త్యాగాలతో ఏర్పడిన పరిశ్రమను కాపాడుకోవాలనే భావోద్వేగం ప్లాంట్‌లో పని చేసే ప్రతి ఒక్కరితోపాటు కార్మిక, ఉద్యోగ సంఘాల నేతల్లో కూడా ఉండాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ పరిశ్రమను కాపాడుకునేందుకు కార్మికులు, ఉద్యోగులు, భూ నిర్వాసితులు తెలిపిన ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తానని తెలిపారు. 


Similar News