Prof. HaraGopal: నిజనిర్ధారణ కమిటీ సభ్యుల అరెస్టు.. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రొ.హరగోపాల్ కీలక వ్యాఖ్యలు

రఘునాథపాలెం ఎన్ కౌంటర్ ప్రాంతానికి బయలుదేరిన పౌరహక్కుల నేతలను పోలీసులు అరెస్టు చేశారు.

Update: 2024-09-14 06:10 GMT

దిశ, డైనమిక్ బ్యూరో/ అశ్వాపురం/మణుగూరు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం ఎన్ కౌంటర్ పై నిజనిర్ధారణకు వెళ్తున్న పౌర హక్కుల సంఘం నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 5వ తేదీన రఘునాథపాలెం అటవీ ప్రాంతంలో లచ్చన్న దళంపై జరిగిన ఎన్ కౌంటర్ లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఎన్ కౌంటర్ పై ఫ్యాక్ట్ ఫైండింగ్ కోసం శనివారం ఉదయం ఘటన స్థలానికి బయలుదేరిన పౌరహక్కుల సంఘం నేతలను దారిలోనే మణుగూరు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు ప్రొ.లక్ష్మణ్, కార్యదర్శి నారాయణతో పాటు మరో 14 మందిని అరెస్టు చేసి అశ్వాపురం పోలీస్ స్టేషన్ కు తరలించి వారిని ప్రశ్నిస్తున్నారు. ఎన్ కౌంటర్ పై నిజానిజాల విచారణకు వెళ్లుతుంటే మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారని నేతలు పోలీసులను నిలదీశారు. మీడియాకు అనుమతి నిరాకరించి పోలీసు స్టేషన్ గేటుకు తాళాలు వేశారు. స్టేషన్ గేటు దగ్గర సిబ్బందిని పహారా పెట్టారు. దీంతో అక్కడ పరిస్థితి హైటెన్షన్ గా మారింది. ఈ అరెస్టులపై అశ్వాపురం సీఐని మీడియా వివరణ కోరగా ఉన్నతాధికారుల ఆదేశాలతో మీడియాను లోపలికి అనుమతించబోవడం లేదన్నారు. అశ్వాపురం స్టేషన్ నుంచి పౌర హక్కుల నేతలను బస్సులో మరో ప్రాంతానికి తరలించారు. అయితే వారిని ఎక్కడికి తరలిస్తున్నారో పోలీసులు గోప్యంగా ఉంచారు. పోలీసు తీరుపై పలువురు నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ క్రమంలో అక్కడ హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది.

ఎన్ కౌంటర్ లో లచ్చన్న దళం హతం:

రఘునాథ పాలెం దామెరతోగు అటవీ ప్రాంతంలో లచ్చన్న దళం కార్యకలాపాలు సాగిస్తున్నట్లు వచ్చిన సమాచారంతో పోలీసులు ఆ ప్రాంతాన్ని ఈ నెల 5వ తేదీన చుట్టుముట్టారు. ఈ క్రమంలో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో కుంజ వీరన్న అలియాస్ లచ్చన్న, పూనెం లక్ష్మి అలియాస్ తులసి, కొవ్వాసి రాము, పొడియం కొసయ్య అలియాస్ సుకురాం, దుర్గేశ్, కొసి అలియాస్ వెన్నెల మృతి చెందారు. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులకు సైతం గాయాలయ్యాయి.

కమిటీ సభ్యులను వెంటనే రిలీజ్ చేయాలి:ప్రొ.హరగోపాల్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రఘునాథపాలెం పరిసరాల్లో ఈ నెల 5న జరిగిన భారీ ఎన్ కౌంటర్ పై నిజ నిర్ధారణకు వెళ్లిన పౌర హక్కుల నేతలను పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని పౌరహక్కుల సంఘం నేత ప్రొఫెసర్ హరగోపాల్ ఖండించారు. వెంటనే నిజనిర్ధారణ కమిటీ సభ్యులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 15 ఏళ్ల తర్వాత భారీ ఎన్ కౌంటర్ జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మళ్లీ ఎన్ కౌంటర్ జరగడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఎన్ కౌంటర్ జరిగిన చోట అసలేం జరిగిందో వాస్తవాలు తెలుసుకోవడానికే నిజనిర్ధారణ కమిటీ వెళ్తున్నదని ఫ్యాక్ట్ ఫైండింగ్ అనేది కొత్త పద్దతేమి కాదని గత 55 ఏళ్ల నుంచి జరుగుతున్నదే అన్నారు. ఈ ఎన్ కౌంటర్ పై నిజనిర్ధారణ కమిటీకి పోలీసులు కూడా తమ వాదన చెప్పుకోవచ్చు అన్నారు. వాస్తవాలు బయటకు తేవడమే పౌరహక్కుల సంఘం లక్ష్యం అని చెప్పారు. కమిటీ సభ్యుల నిర్భందాలు సరికాదన్నారు. పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. నిజనిర్ధారణ కమిటీని అక్కడికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వడంతో పాటు ప్రభుత్వమే ఓ కమిటీని వేసి నిజానిజాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు.


Similar News