ఆ గ్రామ రైతులు ఆదర్శప్రాయులు

"ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా..నిజం తెలిసి నిదురపోకుమా.." అనే ఓ తెలుగు సినిమా పాటలోని వాస్తవాన్ని ఆ గ్రామ రైతులు గుర్తించారేమో..తమ సమస్యను తామే సంఘటితంగా పరిష్కరించుకున్నారు..

Update: 2024-08-13 04:18 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్: "ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా..నిజం తెలిసి నిదురపోకుమా.." అనే ఓ తెలుగు సినిమా పాటలోని వాస్తవాన్ని ఆ గ్రామ రైతులు గుర్తించారేమో..తమ సమస్యను తామే సంఘటితంగా పరిష్కరించుకున్నారు.. నరకం చూపిస్తున్న రోడ్డును స్వచ్ఛందంగా బాగు చేసుకున్నారు. రైతులు సొంత డబ్బులు పోగేసుకొని రోడ్డు మరమ్మతులు చేసుకున్నారు. ట్రాక్టర్లు మాట్లాడుకుని రోడ్డును బాగు చేసుకున్నారు.

వివరాల్లోకి వెళితే..

నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం వాడి గ్రామంలో ఎస్సీ కాలనీ నుంచి గ్రామ శివారులోని పంట పొలాల వరకు ఉన్న రోడ్డు ఇటీవల కురిసిన ఎడతెరిపిలేని వర్షాలతో అధ్వానంగా మారింది. రోడ్డుపై నడక నరకప్రాయంగా మారింది. అధికారులకు, ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్నారు. పట్టించుకోలేదు. ఇక లాభం లేదనుకుని తమకు తాముగా ముందుకొచ్చి రొడ్డును బాగు చేసుకుందామని నిర్ణయానికొచ్చారు. రైతులంతా చోట సమావేశమై ఏం చేద్దాం.. ఎలా చేద్దామనే అంశంపై సుదీర్ఘంగా చర్చించుకుని తలా కొంత సొంత డబ్బులు పోగేసుకొని రోడ్డును బాగు చేసుకోవాలనే నిర్ణయానికొచ్చారు. అనుకున్నదే తడవుగా రంగంలోకి దిగారు. దాదాపు 1500 మీటర్లు (కిలోమీటరున్నర) వరకు మొరం రోడ్డు వేసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు రొండ్ల రవి, నర్సరెడ్డి, దండు నర్సయ్యలు మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం వ్యవసాయ పనుల కోసం వెళ్లేందుకు ఎంతో ఇబ్బందిగా మారుతోందన్నారు. నాట్లు వేసుకునే సమయంలో ఈ రోడ్డుపై ట్రాక్టర్ కేజ్ వీల్స్ నడవడంతో పాటు నిత్యం రైతుల వాహనాల రాకపోకలుంటాయన్నారు. పంట పొలాల్లోకి పనుల కోసం వెళ్ళాలంటే భయం భయంగా వెళ్లాల్సిన పరిస్థితులు ఉంటాయన్నారు.

బైకులపై మందు సంచులు వేసుకుని పంట పొలాలకు వెళ్లాలంటే, వెహికల్ అదుపుతప్పి రోడ్డుపై రెండు మూడు చోట్ల పడుతూ, లేస్తేగాని పొలానికి చేరుకోలేని పరిస్థితున్నాయని రైతులు అన్నారు. చాలామంది రైతులు బైక్ పై నుంచి పడి గాయాల పాలైన సంఘటనలున్నాయన్నారు. ఇదే రోడ్డులో గ్రామ దేవతలు పోచమ్మ , ఎల్లమ్మ ఆలయాలు కూడా ఉన్నాయని, చుట్టుపక్కల గ్రామాల నుంచి ఎల్లమ్మ ఆలయానికి ప్రజలు వస్తుంటారన్నారు. తమ పరిధిలో ఇప్పటికిప్పుడు తాత్కాలికంగా రోడ్డుకు మరమ్మతులు చేసినా, ప్రజల అవసరాల దృష్ట్యా ఈ రోడ్డుకు శాశ్వత పరిష్కారం జరగాలంటే బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని రైతులు కోరుతున్నారు. రోడ్డు తాత్కాలిక మరమ్మతుకు దాదాపు 250 ట్రాక్టర్ల మొరం అవసరమైంది. రోడ్డు మధ్యలో చెరువు నుంచి వచ్చే కాలువలో రైతులు పైప్ లైన్ కూడా వేసుకున్నారు. సుమారు రూ. 1.50 లక్షలకు పైగా ఖర్చును రైతులే భరించుకున్నారు. రైతుల చొరవ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తోంది. ఈ కార్యక్రమంలో మధు, భాస్కర్, మోహన్ రెడ్డి, రమేష్, సురేష్, గంగారాజం, తదితరులు రైతులు పాల్గొన్నారు.


Similar News