Admissions : జవహర్ నవోదయ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం..
నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం పెద్దవూర మండలం చలకుర్తి గ్రామంలో ఉన్న నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది.
దిశ, నాగార్జునసాగర్: నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం పెద్దవూర మండలం చలకుర్తి గ్రామంలో ఉన్న నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యను ఉచితంగా అందిస్తూ ఉజ్వల భవిష్యత్కు బాటలు వేస్తున్నది జవహర్ నవోదయ విద్యాలయం. కేంద్ర మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో 1986 జాతీయ విద్యా విధానాన్ని అనుసరించి అప్పట్లో దేశ వ్యాప్తంగా జవహర్ నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేశారు. అందులో భాగంగా నల్గొండ జిల్లాకు సంబంధించిన చలకుర్తి గ్రామంలో 45 ఎకరాల విస్తీర్ణంలో ఈ విద్యాలయాన్ని నిర్మించారు. ఇందులో 6నుంచి 12వ తరగతి వరకు ఉచిత విద్య, బాల బాలికలకు వేర్వేరుగా వసతి సౌకర్యం కల్పిస్తున్నారు. ప్రతి సంవత్సరం ప్రవేశ పరీక్ష ద్వారా 6వ తరగతిలో ప్రవేశం కల్పిస్తారు. 6నుంచి 8వ తరగతి వరకు ప్రాంతీయ భాష లేదా మాతృ భాషలో విద్యా బోధన జరుగుతుంది. ఆ తర్వాత గణితం, సైన్స్ సబ్జెక్టులు ఆంగ్ల భాషలో, సామాజిక శాస్త్రం హిందీలో బోధిస్తారు.
విద్యా అర్హులు
చలకుర్తి జవహర్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతిలో మొత్తం 80 సీట్లు ఉండగా.. అందులో 75 శాతం గ్రామీణ ప్రాంత విద్యార్థులకు, 25 శాతం సీట్లు పట్టణ ప్రాంత విద్యార్థులకు కేటాయించారు. గ్రామీణ ప్రాంత రిజర్వేషన్ వర్తించాలంటే 3, 4, 5 తరగతులు గ్రామీణ ప్రాంతాల్లో చదివి ఉండాలి. ఏ ఒక్క రోజూ పట్టణ ప్రాంతాల్లో, మున్సిపాలిటీల్లో చదివినా గ్రామీణ ప్రాంత రిజర్వేషన్ వర్తించదు. ఒక్కసారి పరీక్షకు హాజరైన విద్యార్థి రెండోసారి రాసేందుకు అవకాశం లేదు. ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5, బాలికలకు మొత్తం సీట్లలో 1/3 వంతు రిజర్వేషన్ సౌకర్యం ఉన్నది. ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ప్రస్తుతం 5వ తరగతి చదువుతూ
వచ్చే విద్యా సంవత్సరంలో నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతి ప్రవేశాల కోసం సెప్టెంబర్ 16 వరకు దరఖాస్తులను సమర్పించవచ్చు. ప్రస్తుతం 5వ తరగతి చదువుతూ ఉండాలని, విద్యార్థులు తప్పనిసరిగా ఉమ్మడి జిల్లా పరిధిలో నివసిస్తూ ఉండాలని కోరారు. అభ్యర్థులు 01.05.2013 నుంచి 31.07.2017 మధ్య జన్మించి ఉండాలని, మూడు, నాలుగు, అయిదు తరగతులు ప్రభుత్వ లేదా ప్రభుత్వామోదిత పాఠశాలల్లో చదువుతూ ఉండాలన్నారు. దరఖాస్తులు అంతర్జాలం ద్వారా 16.09.2024 లోపు సమర్పించాలని సూచించారు. ప్రవేశ పరీక్ష తేదీ 18.01.2025 ఉంటుందని తెలిపారు. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పాఠశాల ప్రిన్సిపాల్ తెలియజేశారు.
దరఖాస్తు: ఆన్లైన్లో జేఎన్వీ అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక: ప్రవేశ పరీక్ష ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది