ప్రజా సంక్షేమమే.. ప్రభుత్వ లక్ష్యం..

ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెల్తోందని ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు.

Update: 2024-07-04 11:25 GMT

దిశ, నార్కట్ పల్లి : ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెల్తోందని ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. నార్కట్ పల్లి మండలంలో లబ్ధిదారులకు మంజూరైన 55 కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను గురువారం పంపిణీ చేసి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించేందుకు సిద్ధంగా ఉందన్నారు. గత ప్రభుత్వంలో అర్హులకు పథకాలు అందకుండా ఫైరవీలు నడిచాయని ప్రస్తుతం అలాంటివి ఏమీ నడవవన్నారు. రాబోయే రెండు నెలల్లో ఇందిరమ్మ ఇళ్ళను లబ్ధిదారులకు అందజేస్తామన్నారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం అన్ని హామీలను వాగ్దానాలను అమలు చేస్తామన్నారు. ప్రతి నిత్యం ప్రజల్లోనే ఉంటూ వారి సమస్యలను పరిష్కరించేందుకు ముందుంటానన్నారు. నకిరేకల్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తానని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు బత్తుల ఊషయ్య గౌడ్, ఎంపీటీసీ సభ్యులు పాశం శ్రీనివాస్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ దూదిమెట్ల సత్తయ్య, పట్టణ పార్టీ అధ్యక్షులు జేరిపోతుల భరత్ గౌడ్, మాజీ సర్పంచ్ లు పుల్లెంల అచ్చాలు, నేతకాని కృష్ణ, దొండ రమేష్, ఆర్ఐ తరుణ్ తదితరులు పాల్గొన్నారు.


Similar News