మైహోం మాయ.. నిషేధిత జాబితాలో భూములు

ఇల్లు లేదా ఏదైనా కట్టడాల నిర్మాణం జరుపుకోవాలంటే ముందస్తుగా గ్రామీణ ప్రాంతాల్లో అయితే గ్రామ పంచాయతీ పట్టణ ప్రాంతాల్లో అయితే మున్సిపాలిటీలో అనుమతులు పొందాలి.

Update: 2023-05-11 03:24 GMT

దిశ నేరేడుచర్ల /మేళ్లచెరువు: ఇల్లు లేదా ఏదైనా కట్టడాల నిర్మాణం జరుపుకోవాలంటే ముందస్తుగా గ్రామీణ ప్రాంతాల్లో అయితే గ్రామ పంచాయతీ పట్టణ ప్రాంతాల్లో అయితే మున్సిపాలిటీలో అనుమతులు పొందాలి. ఆ అనుమతి పొందిన తర్వాతనే ఏవైతే నిర్మాణం జరపాలని భావించి దరఖాస్తు చేసుకుంటే వాటిని గ్రామ పంచాయతీ లేదా మున్సిపాలిటీ అధికారులు ల్యాండ్‌ను పరిశీలించి అనుమతిస్తేనే ఆ అనుమతితో నిర్మాణం జరుపుకోవాలి . కానీ భిన్నంగా నిర్మాణం పూర్తయిన తర్వాత నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకొని అనుమతులు పొందిన సంఘటన సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలోని మై హోమ్ సిమెంట్ పరిశ్రమ చేపట్టిన అపార్ట్మెంట్ దానికి నిదర్శనమని చెప్పుకోవచ్చు.

గతంలో అక్రమమని తిరస్కరించిన అధికారులు..

మై హోమ్ చేపట్టిన కట్టడాల నిర్మాణాలు సర్వేనెంబర్ 1057 లో గల వివాదాస్పద ప్రభుత్వ భూమిలో కావడం విశేషం. ఈ 1057 సర్వే నెంబర్ గల భూమిలో 150 ఎకరాల భూదాన భూమి, 18 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది . ఈ భూమిపై ప్రభుత్వానికి మై హోం సంస్థ మధ్య గడిచిన 10 సంవత్సరాలుగా కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి.ఈ భూములను ప్రభుత్వం నిషేధిత జాబితాలో చేర్చింది. ఈ భూములపై ఎటువంటి నిర్మాణాలు కట్టడాలు చేపట్టకూడదు. కానీ గత ఏడాది ఈ భూముల్లో అక్రమ నిర్మాణాలకు, భూ కబ్జాకు సహకరించిన అధికారులపై కోర్టు డైరెక్షన్లో క్రిమినల్ కేసులు అయిన విషయం తెలిసిందే.

1057 సర్వే నెంబర్ గల భూముల్లో అక్రమంగా చేపడుతున్న నిర్మాణాలను రెవెన్యూ, పంచాయతీ రాజ్ శాఖ అధికారులు గతంలో పలుమార్లు నిర్మాణ పనులను అడ్డుకొని మై హోం కంపెనీకి నిర్మాణాలు నిలిపి వేయాల్సిందిగా నోటీసులు అందజేశారు. గత సంవత్సరం ఆగస్టు నుంచి ఏప్రిల్ 2023 వరకు ఐదు సార్లు ఈ భూములలో నిర్మాణ కట్టడాల కోసం మై హోమ్ దరఖాస్తు చేసుకోగా వాటిని గ్రామ పంచాయతీ అధికారులు పాలకవర్గం తిరస్కరించారు.

అపార్ట్మెంట్లకు అనుమతులు ఓకేనా..!?

భూదాన్ ప్రభుత్వ భూములలో నిర్మాణం చేపట్టిన అపార్ట్మెంట్ కు పంచాయతీ అధికారులతో పాటు వివిధ శాఖల అధికారులు గతంలో పలుసార్లు జరిగే పనులను నిలిపివేయాలని నోటీసులు అందజేశారు. అప్పుడు అక్రమంగా నిర్మాణం చేపడుతున్నారన్న అధికారులు ఇప్పుడు సక్రమంగా భావించి అనుమతులిచ్చారా.? గతంలో అనుమతులు ఇవ్వని అధికారులు ఇప్పుడు అనుమతులు ఇవ్వడం వెనుక ఏదైనా రాజకీయ కోణం ఉందా..! రాజకీయ నాయకుల ఒత్తిడితోనే ఈ అనుమతులను పొందారా..? అనే ప్రజలలో పెద్ద ఎత్తున జరుగుతుంది . వీటికి సంబంధించి వివరాల కోసం దిశ ప్రతినిధులు మేళ్లచెరువు పంచాయతీ ఈవో నారాయణ రెడ్డి తోపాటు ఎంపీఓ వీరయ్య కు ఫోన్ చేసినా మెసేజ్ పెట్టిన స్పందించలేదు.

Tags:    

Similar News