రాష్టంలో బీసీలంతా ఏకం.. ఇక వార్ వన్ సైడే: బీఆర్ఎస్‌పై ఎంపీ లక్ష్మణ్ ఫైర్

విద్యార్థుల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణాలో ప్రజలు, యువత, నిరుద్యోగుల ఆశలను వమ్ము చేసిన కేసీఆర్ అంటే నమ్మకం కాదు.. అమ్మకం అని రాజ్యసభ సభ సభ్యుడు లక్ష్మణ్

Update: 2023-11-08 16:33 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: విద్యార్థుల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణాలో ప్రజలు, యువత, నిరుద్యోగుల ఆశలను వమ్ము చేసిన కేసీఆర్ అంటే నమ్మకం కాదు.. అమ్మకం అని రాజ్యసభ సభ సభ్యుడు లక్ష్మణ్ అభివర్ణించారు. బుధవారం ఆయన సోమాజిగూడలో పత్రిక సమావేశంలో మాట్లాడుతూ.. రాజకీయ ముసుగులో కల్వకుంట్ల కుటుంబం కోట్ల సంపదకు పడగలెత్తారని ఆరోపించారు. నిరుద్యోగుల పాపం ఊరికే పోదని.. తప్పకుండా ఈ ఎన్నికల్లో కేసీఆర్ గుణపాఠం చెప్తారని అన్నారు. రాష్ట్ర ఖజానాను కల్వకుంట్ల కుటుంబం దోచుకుంటుoదని ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్ ఈ రాష్టంలోని భూములన్నీ అమ్ముకుంటూ మోసం చేస్తున్నారని విమర్శించారు. రాష్టంలో బీసీలు అంత ఏకమయ్యారని.. ఇక వార్ వన్ సైడ్ అవుతుందని తద్వారా బీజేపీ బీసీ సీఎం అవుతారని పేర్కొన్నారు. దగాకోరు రాజకీయాలు చేయడంలో కాంగ్రెస్, బీఅర్ఎస్‌లు దిట్ట అని ఆయన విమర్శించారు.

రెండు పార్టీల డీఎన్ఏ ఒక్కటేనన్నారు. రెండు పర్యాయాలు కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ది చెప్పిన కాంగ్రెస్‌కు బుద్ది రావడం లేదన్నారు. బీసీ సమాజాన్ని కాంగ్రెస్ నేతలు అవహేళన చేసి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి కల్లున్న కబోధని విమర్శించారు. నిజామాబాద్‌లో 11 అసెంబ్లీ స్థానాలు ఉంటే కాంగ్రెస్ పార్టీ ఒక్క బీసీకు టికెట్ ఇవ్వలేదు, దీనికి రేవంత్ రెడ్డి జవాబు చెప్పాలని ప్రశ్నించారు. కేసీఆర్ గడీల రాజ్యం బద్దలు కొట్టడానికి బీసీ సమాజం ఏకం అవుతోందన్నారు. అన్ని సామాజిక వర్గాలను మోసం చేసిన ఘనత కేసీఆర్‌దని అన్నారు. బీసీ సమాజమంతా ఆలోచన చేయాల్సిన సందర్భం ఇది. కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు ఓటేస్తే పెంక మీద నుంచి పొయ్యిలో పడ్డట్లేనని చెప్పారు. బీజేపీకి ఒక్కసారి తెలంగాణ ప్రజలు అవకాశం ఇవ్వాలని.. కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు దమ్ముంటే బీసీ, ఎస్సీ వర్గాలను ముఖ్యమంత్రులుగా ప్రకటించాలని లక్ష్మణ్ సవాలు విసిరారు.


బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి పై తన మనసులో మాట చెప్పిన కిషన్ రెడ్డి 

Tags:    

Similar News