Minister Sridhar Babu: రూ.3 వేల కోట్లతో పారిశ్రామిక మండలి: మంత్రి శ్రీధర్ బాబు
రూ.3 వేల కోట్ల పారిశ్రామిక మండలిని జహీరాబాద్లో ఏర్పాటు చేయనున్నామని, అందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల సంసిద్ధత తెలిపిందని మంత్రి శ్రీధర్బాబు తెలిపారు.
దిశ, తెలంగాణ బ్యూరో: రూ.3 వేల కోట్ల పారిశ్రామిక మండలిని జహీరాబాద్లో ఏర్పాటు చేయనున్నామని, అందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల సంసిద్ధత తెలిపిందని మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. సచివాలయంలో మంగళవారం అమెరికా కాన్సులేట్ అధికారులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలో నైపుణ్యం ఉన్న మానవ వనరుల లభ్యత అపారంగా ఉందన్నారు. ఐటీ ఎగుమతుల్లో హైదరాబాద్ దేశంలోనే రెండో స్థానంలో ఉండటానికి సాంకేతిక నిపుణులు అందుబాటులో ఉండటం వల్లనే సాధ్యమైందని తెలిపారు.
అభివృద్ధి చెందుతున్న భారత్లో తెలంగాణకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. వ్యాపార, పారిశ్రామిక సంస్థల ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాలు సమృద్ధిగా ఉన్నాయని తెలిపారు. రెండు వారాల్లోనే సింగిల్ విండో విధానంలో పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేస్తున్నామని, నీరు, విద్యుత్తు నిరంతరాయంగా అందించే సామర్థ్యం తెలంగాణకు ఉందని వివరించారు. రైలు, రోడ్డు, విమాన రవాణా కనెక్టివిటీలు ఉన్నాయని తెలిపారు. ఈ సమావేశంలో యూఎస్ కాన్సులేట్ అధికారులు, యూఎస్ ప్రభుత్వ కన్సల్టెంట్లు నెల్సన్ కన్నింగ్ హామ్, రెబెకా డ్రేమే, ఫ్రాంక్ టల్లుటో, అఖిల్ బెరిలు పాల్గొన్నారు.