డీఎస్ పార్థీవ దేహానికి మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళులు
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యులు డీఎస్ శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు.
దిశ, వెబ్డెస్క్: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యులు డీఎస్ శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు. కాగా, రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ డీఎస్ మృతి పట్ల సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా డీ.శ్రీనివాస్ మంత్రిగా, పీసీసీ చీఫ్గా చేసిన సేవలను మంత్రి పొన్నం ప్రభాకర్ గారు గుర్తు చేసుకున్నారు. సుదీర్ఘ కాలం పార్టీలో ఆయనతో ఉన్న అనుబంధాన్ని స్మరించుకున్నారు. డీఎస్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసారు. ఈ క్లిష్ట సమయంలో వారి కుటుంబ సభ్యులకు మరింత ధైర్యాన్ని ఇవ్వాలని ఆ దేవుడిని ప్రార్థించారు.
మహేష్ కుమార్ గౌడ్ సంతాపం..
మాజీ పీసీసీ అధ్యక్షులు, మాజీ మంత్రి, డీఎస్ రాజకీయాలలో అపార అనుభవం ఉన్న నేత అని, బడుగు బలహీన వర్గాలు కోసం ఆయన ఎంతో శ్రమించారని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. డీఎస్తో తనకు నాలుగు దశాబ్దాల అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు.