Ponnam Prabhakar: 'ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడండి'.. బీఆర్ఎస్ పై మంత్రి పొన్నం ఫైర్

బీజేపీ, బీఆర్ఎస్ కలిసి మా ప్రభుత్వాన్ని అస్థిర పరిచే ప్రయత్నాలు చేస్తున్నాయని మంత్రి పొన్నం ఆరోపించారు.

Update: 2024-09-14 07:35 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీసే కుట్ర జరుగుతున్నదని, ఇటువంటి వాటికి ఎవరు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రతిపక్షం వ్యవహరిస్తోందని అన్నారు. ఇవాళ ఆయన గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. అధికార పక్షం వారైనా, ప్రతిపక్షం వారైనా పోలీసులకు చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశామన్నారు. బీఆర్ఎస్ నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని మంత్రి వార్నింగ్ ఇచ్చారు. పాడి కౌశిక్‌రెడ్డి అరికెపూడి గాంధీని రెచ్చగొట్టారని, అయితే ప్రజాస్వామ్యంలో భౌతికదాడులు మంచి పద్ధతి కాదన్నారు. హైదరాబాద్‌లో ఉన్నవారిపై తాము ఏనాడూ వ్యతిరేకంగా మాట్లాడలేదన్నారు. కేసీఆరే ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొట్టారని గుర్తు చేశారు. ‘బిర్యానీ మాది.. పెండ మీది’ అని కేసీఆర్ అనలేదా అని ప్రశ్నించారు. ఆంధ్రోళ్లపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాట్లాడిన వీడియోను కేటీఆర్‌కు పంపుతానన్నారు. పదేళ్లు పరిపాలించిన వారు పదినెలలు కూడా ఓపిక పట్టకపోతే దాన్ని అసహనం అంటారని పేర్కొన్నారు.

ఫిరాయింపుల్లో మాస్టర్ బీఆర్ఎస్సే..

తాము ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించలేదని, ఫిరాయింపుల్లో మాస్టర్ బీఆర్ఎస్సేనని, ఈ విషయంలో ఆ పార్టీ డాక్టరేట్ సాధించిందని పొన్నం సెటైర్ వేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక టీడీపీ, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ పార్టీ సభ్యులను చేర్చుకున్నదని గుర్తు చేశారు. పార్టీకి రాజీనామా కూడా చేయని టీడీపీ వ్యక్తిని బీఆర్ఎస్‌లో అనైతికంగా చేర్చుకుని మంత్రి పదవి ఇచ్చిన చరిత్ర ప్రజలు మరువలేదన్నారు. బీఆర్ఎస్, బీజేపీ గొంతుకలిపి తమ ప్రభుత్వాన్ని కూలగొడతామన్న మాట నిజం కాదా అని ప్రశ్నించారు. పేదల కోసం పని చేస్తున్న ఈ ప్రభుత్వానికి అండగా నిలవాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యేలు పార్టీలోకి వస్తుంటే వారిపై బురద జల్లుతున్నారని పేర్కొన్నారు. వారు చేస్తే రాజకీయ నీతి, తాము చేస్తే తప్పా అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ దళిత వ్యక్తిని సీఎల్పీ లీడర్ చేస్తే ఓర్వలేక తమ పార్టీని బలహీన పర్చలేదా అన్నారు. తాము ఏనాడూ ప్రతిపక్షాల గొంతు నొక్కలేదని, అసెంబ్లీలో వారి వాదనలు వింటున్నామని, ధర్నాచౌక్ లో ధర్నాలకు అవకాశం ఇచ్చామని చెప్పారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలు చేసినా, వ్యక్తిగత విమర్శలు చేసినా జాగ్రత్త అని మంత్రి హెచ్చరించారు.


Similar News