KTR : భారీ వర్షంపై గత నెలలోనే తెలిపిన వాతావరణ కేంద్రం.. కేటీఆర్ ఆసక్తికర పోస్ట్

హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం 27 ఆగస్టు నాడు పలు తెలంగాణ జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నదని తెలిపిందని మాజీ మంత్రి కేటీఆర్ వెల్లడించారు.

Update: 2024-09-02 15:11 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం 27 ఆగస్టు నాడు పలు తెలంగాణ జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నదని తెలిపిందని మాజీ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా వాతావరణ శాఖ రిపోర్ట్ పోస్ట్ చేశారు. ఈ క్రమంలోనే వాతావరణ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం అలెర్ట్‌గా ఉండాలని తెలియజేసిందని పేర్కొన్నారు. కానీ, రాష్ట్రంలోని కుంభకర్ణ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదు.. ఎలాంటి ముందు జాగ్రత్తలు లేవు. స్థానిక ప్రజలకు హెచ్చరికలూ లేవు.. అని విమర్శించారు.

రేవంత్ సర్కార్ నేరపూరిత నిర్లక్ష్యం ఖరీదు.. ఒక యువ శాస్త్రవేత్తతో పాటు సుమారు ఇరవై మంది ఈ వరదల్లో ప్రాణాలు కోల్పోయారన్నారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారని తెలిపారు. ‘ఒక మంత్రి హెలికాప్టర్లు దొరకలేదంటాడు.. మరొక మంత్రి, ఈ రాష్ట్రానికి సీఎం లేనట్టు పక్క రాష్ట్రపు సీఎంకు ఫోన్ చేస్తాడు. మూడో మంత్రి ఫోటోలకు పోజులకే పరిమితమవుతాడు. జరగాల్సిన నష్టమంతా జరిగాక పూల డెకరేషన్ స్టేజి మీద కూర్చొని వరదల మీద సమీక్ష చేసే చీఫ్ మినిస్టర్ ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అన్నట్టు వరదలొస్తే సహాయం చేయకుండా ప్రతిపక్షం ఏం చేస్తుందని ప్రశ్నిస్తాడు’ అని ఎక్స్ లో రాసుకొచ్చారు.


Similar News