సర్కార్ బడుల్లో సమస్యల పరిష్కారం మాది : దామోదర రాజనర్సింహ

సర్కార్ బడుల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడం మా బాధ్యత... విద్యార్థులకు న్యాన్యమైన ప్రామాణికమైన విద్యను అందించడం ఉపాధ్యాయులుగా మీ బాధ్యత అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు.

Update: 2024-06-12 16:19 GMT

దిశ, ఆందోల్: సర్కార్ బడుల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడం మా బాధ్యత... విద్యార్థులకు న్యాన్యమైన ప్రామాణికమైన విద్యను అందించడం ఉపాధ్యాయులుగా మీ బాధ్యత అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. ప్రభుత్వ బడులపై ప్రజల ఆలోచన విధానం మార్చుకోవాలని, ఆ బడులు మనవి అనే భావన ప్రతి ఒక్కరిలో కలగాలని ఆయన సూచించారు. బుధవారం రాయికోడ్ లో నిర్వహించిన 'బడి- బాట' కార్యక్రమానికి హాజరయ్యారు. వేసవి సెలవులు ముగియడంతో ఆయన పాఠశాలను పునః ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్య బోధన కొనసాగించే దిశగా ఉపాధ్యాయులు చొరవ చూపాలన్నారు. పాఠశాలకు సంబంధించి పలు సమస్యలను పాఠశాల ప్రిన్సిపాల్ మంత్రి దృష్టికి తీసుకురాగా ఆయన స్పందించారు.

పాఠశాలల్లో తాగునీటి సౌకర్యం, టాయిలెట్స్, తరగతి గదుల నిర్మాణాలు, కాంపౌండ్ వాల్, విద్య బోధనకు సంబంధించిన సాంకేతిక పరమైన అన్ని సౌకర్యాలు కల్పించే బాధ్యత ప్రభుత్వానిదే నని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నతమైన స్థానాల్లో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలన్నిటిని పరిష్కరించేందుకే రాష్ట్ర ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాల పథకానికి శ్రీకారం చుట్టిందన్నారు. ఈ పథకం ద్వారా పాఠశాలల్లో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. ప్రభుత్వ బడుల్లో పిల్లల చేరికలను ప్రోత్సహించేందుకు సర్కార్ బడి బాట కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు.

గ్రామాల్లోని ప్రజా ప్రతినిధులు, యువజన సంఘాల నాయకులు, మహిళా సంఘాలు సమిష్టిగా బడి ఈడు పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చేరేందుకు తోడ్పాటు అందించాలని ఆయన కోరారు. జూన్ 19వ తేదీ వరకు బడిబాట కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు అన్నిటిని త్వరలో భర్తీ చేస్తామని ఆయన ప్రకటించారు. పాఠశాల ప్రాంగణంలో అధికారులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను నోట్ బుక్స్ ను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి, జెడ్పి చైర్ పర్సన్ మంజుశ్రీ జయపాల్ రెడ్డి, జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు, జడ్పిటిసి మల్లికార్జున్ పాటిల్, సీనియర్ నాయకులు అంజయ్య, శివకుమార్, సతీష్, తోపాటు తదితరులు పాల్గొన్నారు.


Similar News