విఘాతం కలిగిస్తే కేసులు నమోదు చేయాలి : డీజీపీ జితేందర్

శాంతి భద్రతల పరిరక్షణకు పెద్ద పీఠ వేయాలని డీజీపీ జితేందర్

Update: 2024-10-23 13:23 GMT

దిశ,సిద్దిపేట ప్రతినిధి : శాంతి భద్రతల పరిరక్షణకు పెద్ద పీఠ వేయాలని డీజీపీ జితేందర్ జిల్లా పోలీసు అధికారులను ఆదేశించారు. సిద్దిపేట పోలీస్ కమిషనర్ కార్యాలయంను డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు డాక్టర్ జితేందర్ సందర్శించారు. ఈ సందర్భంగా సర్కిళ్ల వారిగా నమోదైన కేసులు, శాంతి భద్రత తదితర ఆంశాలపై పోలీసు కమిషనర్ డాక్టర్ అనురాధ తో కలిసి జిల్లా పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ...రోడ్డు ప్రమాదాల నివారణకు తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అన్నారు. కేసులలో పారదర్శకంగా పరిశోధన చేసి కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేయాలన్నారు. శాంతి భద్రతల సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటే ముందస్తు సమాచారం తెలుసుకొని పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. గ్రామాలలో పట్టణాలలో పనిచేయని సీసీ కెమెరాలు వెంటనే రిపేర్ చేయించాలన్నారు. డయల్ 100 కాల్ పై వెంటనే స్పందించి సంఘటన స్థలానికి వెళ్లి సమస్యను పరిష్కరించాలన్నారు.

అసాంఘిక శక్తులపై గట్టి నిఘా ఏర్పాటు చేయాలన్నారు. మూఢనమ్మకాలు భానుమతి పై కళా బృందం ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఎస్ఓపీ ప్రకారం క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ చేసి కేసులలో శిక్షల శాతం పెంచాలన్నారు. చట్టాన్ని చేతి లోకి తీసుకొని శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి తగు చర్యలు తీసుకోవాలన్నారు. గంజాయి ఇతర మత్తు పదార్థాలను ఉక్కు పాదంతో అణచివేయాలని అన్నారు. గంజాయి ఇతర మత్తు పదార్థాలు సేవించే వారిపై అమ్మే వారిపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసి చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలన్నారు. అధికారులు సిబ్బంది పోలీసు స్టేషన్ కు వచ్చిన వారితో మర్యాదగా మాట్లాడటంతో పాటుగా ఫిర్యాది సమస్యను ఓపికగా విని పరిష్కారం దిశగా సూచనలు చేయాలన్నారు. సిద్దిపేట కమిషనరేట్ పోలీసు యంత్రాంగం పనితీరును బాగుందని డీజీపీ గారు అభినందించారు.

ఇన్స్ స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మల్టీ జోన్ వన్ చంద్ర శేఖర్ రెడ్డి మాట్లాడుతూ... కమ్యూనిటీ పోలీసింగ్ పలు కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు చేరువ కావాలని సూచించారు. సమావేశంలో అడిషనల్ డీసీపీ యస్. మల్లారెడ్డి, ఏఆర్ అడిషనల్ డీసీపీ రామచంద్రరావు, సుభాష్ చంద్రబోస్, ఏసీపీలు మధు, పురుషోత్తం రెడ్డి, సతీష్, సుమన్ కుమార్, యాదగిరి, రవీందర్, శ్రీనివాస్ ఎస్బీ ఇన్స్ స్పెక్టర్లు కిరణ్, శ్రీధర్, శ్రీధర్ గౌడ్, ఏఓ యాదమ్మ, సీఐలు, ఎస్ ఐ లు తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు డీజీపీ డాక్టర్ జితేందర్ ను కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు.


Similar News