ఎంఎస్‌ కంపెనీ ముందు కార్మికుల బైఠాయింపు.. 300 మంది కార్మికుల నిరసన

పుల్కల్‌ మండలం ఎస్‌ ఇటిక్యాల వద్దనున్న ఎంఎస్‌

Update: 2024-10-23 12:39 GMT

దిశ, అందోల్‌: పుల్కల్‌ మండలం ఎస్‌ ఇటిక్యాల వద్దనున్న ఎంఎస్‌ ఇండస్ట్రీస్‌ స్పిరిట్‌ కంపెనీలో పనిచేస్తున్న కార్మికులు శ్రమదోపిడీకి గురవుతున్నారని సీఐటీయు డివిజన్‌ కార్యదర్శి విద్యాసాగర్‌ అన్నారు. కంపెనీ యాజమాన్యం బోనస్‌ చెల్లింపులో నిర్లక్ష్యం చేస్తున్నారంటూ బుధవారం కంపెనీలో పనిచేస్తున్న కార్మికులు ధర్నాకు దిగారు. కంపెనీ ప్రధాన గేటు ముందు మండుటెండలో కార్మికులందరూ భైఠాయించి, కంపెనీ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న సీఐటీయూ నాయకులు కార్మికులకు మద్దతు పలికారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కంపెనీ ముందు కార్మికులు భైఠాయించారు. ఈ సందర్భంగా సీఐటీయు నాయకుడు విద్యాసాగర్‌ మాట్లాడుతూ ఇటిక్యాల వద్ద గత 8 ఏండ్లుగా కంపెనీ కొనసాగుతున్నదని, కంపెనీలో సుమారుగా 300 మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నారని తెలిపారు.

ఐదేళ్లుగా పనిచేస్తున్న వారికి బోనస్‌ ఇవ్వాలని ఇదివరకే ఈ కంపెనీ యాజమాన్యం తో చర్చలు జరిపితే, ఇప్పుడు అప్పుడు అంటూ కాలాయాపన చేస్తున్నారని మండిపడ్డారు. కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా కంపెనీని కొనసాగిస్తున్నారని, కార్మికులకు ఏలాంటి బెనిఫిట్స్‌ లేవని, సెప్టీ లేదని, జనరల్‌ హలీ డేస్‌ లేవని, మేడే వేతనం చెల్లించడం లేదని, ఈఎస్‌ఐ, పీఎఫ్‌ సౌకర్యాలను కల్పించ కుండా కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం చేస్తుందని ఆయన ఆరోపించారు. కార్మికుల శ్రమను కంపెనీ యాజమాన్యం దోచుకుంటుందని ఆయన విమర్శించారు. కంపెనీ యాజమాన్యం కార్మికులందరి ముందే చర్చలు జరిపి, వారి సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో కార్మికుల సమస్యలను పరిష్కరించేంత వరకు నిరసనను పెద్ద ఎత్తున కొనసాగిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


Similar News