ఆర్టీసీకి పండుగ ఆదాయం కనక వర్షమే

దసరా పండుగ సందర్భంగా ఉమ్మడి మహబూబ్ జిల్లా ఆర్టీసీకి ఆదాయం కనకవర్షం కురిసింది.

Update: 2024-10-14 14:42 GMT

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: దసరా పండుగ సందర్భంగా ఉమ్మడి మహబూబ్ జిల్లా ఆర్టీసీకి ఆదాయం కనకవర్షం కురిసింది. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా ఆర్టీసీ రీజనల్ మేనేజర్ శ్రీదేవి స్థానిక బస్ స్టాండ్ లో ప్రయాణికుల అవసరాల మేరకు బస్సు సౌకర్యాలను పర్యవేక్షిస్తూ 'దిశ' తో మాట్లాడారు.దసరా పండుగ సందర్భంగా జిల్లాలోని 10 ఆర్టీసీ డిపోల నుండి ఈ నెల 9 నుంచి 11 వ తేదీ వరకు మూడు రోజుల్లోనే 10 లక్షల 44 వేల కీలో మీటర్లను తిప్పి,104 శాతం ఓఆర్ తో,4 లక్షల 60 వేల 727 మంది ప్రయాణికులను సురక్షితంగా తమ గమ్య స్థానాలకు చేరవేశామన్నారు. అలాగే 6 కోట్ల 23 లక్షల 67 వేల రూపాయలను ఆర్జించినట్లు తెలిపారు.రాష్ట్రంలోనే మరో మారు రీజియన్ ను మొదటి స్థానంలో నిలిపి,అరుదైన రికార్డు నెలకొల్పామన్నారు. దీంతో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రత్యేకంగా అభినందించారని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. పండుగ ప్రయాణికుల తిరుగు ప్రయాణం కోసం ఆదివారం నుంచి బుధవారం వరకు అన్ని డిపోల నుంచి 210 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్ఎం తెలిపారు.సురక్షిత,సుఖవంతమైన ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించి ఆర్టీసీ సంస్థను ఆదరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.


Similar News