నాణ్యమైన భోజనం వడ్డించాలి.. కలెక్టర్ ఆదర్శ సురభి

Update: 2024-08-21 10:29 GMT

దిశ, వీపనగండ్ల : పాఠశాలల్లోని విద్యార్థులకు నాణ్యమైన రుచికరమైన మధ్యాహ్న భోజనాన్ని మెనూ ప్రకారం వడ్డించాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి అన్నారు. ప్రతి హెచ్ ఎం విద్యార్థులతో కలిసి భోజనం చేయాలని ఆదేశించారు. వీపనగండ్ల మండలంలో బుధవారం ఆకస్మికంగా పర్యటించి పంట పొలాలను పరిశీలించి, పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రెండు రోజుల క్రితం కురిసిన భారీ వర్షాల వల్ల వీపనగండ్ల–కల్వరాల మధ్య బీమా కాలువ వర్షపు నీటితో నిండుగా ప్రవహిస్తున్నడంతో తెగిపోవటానికి సిద్ధంగా ఉందని వెంటనే మరమ్మతులు చేయాలని కాంగ్రెస్ నాయకుడు రమేష్ గౌడ్ కలెక్టర్ దృష్టికి తేగా.. కలెక్టర్ ఆదర్శ సురభి పరిశీలించారు. ఎక్కడ కాలువలు ప్రమాదకరంగా ఉన్నాయో పరిశీలించాలని బీమా ఎస్ సి సత్యశీలా రెడ్డి కి ఫోన్ లో వివరించారు. వరి, కంది పంటలను పరిశీలించి మండలంలో ఏ ఏ పంట ఎంత సాగు అవుతుందో ఏడిఏ చంద్రశేఖర్ ని అడిగి తెలుసుకున్నారు. రైతులు వేసిన పంటలను సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులు ఆన్లైన్లో తప్పనిసరిగా నమోదు చేయాలని, వ్యవసాయ అధికారులు పంటల తెగుళ్లు నివారణ, దిగుబడులపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. వర్షాలు కురుస్తుండటం వల్ల రోగాలు ప్రబలే ప్రమాదం ఉందని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పాఠశాల ప్రత్యేక అధికారికి సూచించారు. విద్యార్థులకు వండిన మధ్యాహ్న భోజనాన్ని జిల్లా కలెక్టర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు తో కలిసి భోంచేశారు. ఎస్సీ వాడలోని ఎస్సీ పాఠశాలను తనిఖీ చేసి పాఠశాల ఆవరణ పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శి విక్రమ్ కు సూచించారు. వసతులు లేవంటూ కొత్తకోట సమీపంలోని అమడుబాకుల వద్దకు తీసుకువెళ్లిన ఎస్సీ గురుకుల పాఠశాలను మళ్లీ వీపనగండ్లలో ఏర్పాటు చేయాలని మాజీ సర్పంచ్ గంగిరెడ్డి, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నక్క విష్ణు, మందపురం రాజు జిల్లా కలెక్టర్ ను కోరారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ మానిటరింగ్ అధికారి మహానంది, వ్యవసాయ అధికారి డాకేశ్వర్ గౌడ్, ఎంపీడీవో శ్రీనివాస్ రావు,నయాబ్ తాసిల్దార్ కృష్ణమూర్తి, ఆర్ఐ కురుమూర్తి తదితరులు ఉన్నారు.

Tags:    

Similar News