ఓరి దేవుడో..లక్కీ డ్రా పేరుతో మామూలు మోసం కాదు..

లక్కీ డ్రా పేరుతో ప్రజల ను మోసం చేసి.. దాదాపుగా మూడు కోట్ల రూపాయలకు పైగా దండుకున్న సంస్థ నిర్వాహకులపై వనపర్తి జిల్లా చిన్నంబావి పోలీసులు కేసు నమోదు చేశారు.

Update: 2024-10-13 15:55 GMT

దిశ,మహబూబ్ నగర్ బ్యూరో : లక్కీ డ్రా పేరుతో ప్రజల ను మోసం చేసి.. దాదాపుగా మూడు కోట్ల రూపాయలకు పైగా దండుకున్న సంస్థ నిర్వాహకులపై వనపర్తి జిల్లా చిన్నంబావి పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నంబావి మండలానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఆక్టివ్ పార్ట్నర్స్ , మరో ముగ్గురు వ్యక్తులు స్లీపింగ్ పార్ట్నర్స్ గా కలిసి తిరుమల ఎంటర్ప్రైజెస్ సంస్థను స్థాపించారు. ఈ సంస్థతో లక్కీ డ్రా నిర్వహించి.. విలువైన వస్తువులను అందిస్తామని ప్రచారం చేశారు. అలాగే సభ్యులను చేర్చేందుకు కొంతమంది ఏజెంట్లను కూడా నియమించుకున్నారు. ప్రతి నెల చందాదారుడు వెయ్యి రూపాయలు చొప్పున 16 నెలలు చెల్లిస్తే ప్రతి నెల డ్రాలో ఒక కారు,రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్, ఆటో,మోటార్ సైకిల్ లను ఇస్తామని ప్రకటించడంతో.. దాదాపుగా 3000 మందికి పైగా సభ్యులుగా చేరారు. నిబంధనల ప్రకారం ప్రతి నెలా పదిమందికి లక్కీ డ్రా లో ఎంపిక చేసి బహుమతులను అందజేసి.. చివరలో మిగిలిన 75 మంది చెందా దారులలో మొదటి 30 మందికి 30000, 25 మందికి 25000, 20 మందికి 20 వేల చొప్పున ఇచ్చే విధంగా బ్రోచర్ల తో వ్యక్తిగతంగా ప్రచారం చేశారు. 9 నెలల వరకు స్కీం సజావుగా సాగింది. ఆ తర్వాత మిగిలిన ఏడు నెలలకు సంబంధించిన విజేతలకు బహుమతులు ఇవ్వకుండా దాటవేస్తూ వచ్చారు. అందరికీ స్కీం ముగిసిన తర్వాత బహుమతులు అందజేస్తామని మభ్యపెడుతూ కాలయాపన చేశారు. స్కీమ్ ముగిసి 10 నెలలు అవుతున్న ఇప్పటివరకు నిర్వాహకులు బహుమతులు,డబ్బులు చెల్లించలేదు. దీంతో తాము మోసపోయామని భావించి ఏజెంట్లు,సభ్యులు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మొత్తం ఐదు మంది లక్కీ డ్రా నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లుగా ఎస్సై రమేష్ 420, 406, 120 సెక్షన్లపై కేసు నమోదు చేసినట్లుగా వెల్లడించారు.


Similar News