వేరే స్టేట్ విద్యార్థులకు పెద్దపీట! మెడికల్ అడ్మిషన్ల స్థానికత‌పై స్పందించిన కేటీఆర్

వైద్య విద్యను అభ్యసించాలని కోటి ఆశలు పెట్టుకున్న విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఏమిటి అని మాజీ మంత్రి కేటీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

Update: 2024-09-14 07:23 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: వైద్య విద్యను అభ్యసించాలని కోటి ఆశలు పెట్టుకున్న విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఏమిటి అని మాజీ మంత్రి కేటీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పక్క రాష్ట్రాల్లో అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతుంటే.. తెలంగాణలో మాత్రం ఇంకెంత కాలం ఈ సందిగ్ధం? అని శనివారం ఎక్స్ వేదికగా వెల్లడించారు. రాష్ట్రంలో ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్ల ప్రక్రియకు బ్రేకులు పడటం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి నిలువెత్తు నిదర్శనమని విమర్శించారు. విద్యార్థులను ఆగం చేసి.. ఇంకెంత కాలం దీన్ని సాగదీస్తారు? అని ప్రశ్నించారు.

తెలంగాణ బిడ్డలను నాన్ లోకల్స్‌గా మార్చి, ఇతర రాష్ట్రాల విద్యార్థులకు పెద్దపీట వేసే జీఓ 33 అమలు కోసం సర్కారు ఎందుకింత మొండిపట్టు పడుతోందని ప్రశ్నించారు. స్థానికతను నిర్ధారించే విషయాన్ని ప్రభుత్వం ఎందుకింత వివాదాస్పదం చేస్తోందన్నారు. రోజురోజుకూ ఇంకా ఎందుకు న్యాయపరమైన చిక్కుల్లోకి నెడుతోందని ప్రశ్నించారు. తమ పిల్లల్ని డాక్టర్లుగా చూడాలని కలలు కంటున్న వేలాది మంది తల్లిదండ్రుల ఆకాంక్షలను దెబ్బతీసే గొడ్డలిపెట్టు లాంటి నిర్ణయాలను ప్రభుత్వం ఇకనైనా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సమైక్యరాష్ట్రంలో 5 కేవలం మెడికల్ కాలేజీలు ఉంటే.. స్వరాష్ట్రంలో 29 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకుని వాటి సంఖ్యను 34కు పెంచుకున్నది ఇందుకేనా? అని ప్రశ్నించారు. జిల్లాకో మెడికల్ కాలేజీ నినాదాన్ని బీఆర్ఎస్ హయాంలో నిజం చేస్తే.. కాంగ్రెస్ సర్కారు రాగానే దారుణంగా నీరుగారుస్తోందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ఎంబీబీఎస్‌ను సీట్లను ఏకంగా 8,915కు పెంచుకుని రాష్ట్రాన్ని డాక్టర్ల ఫ్యాక్టరీగా తీర్చిదిద్దితే, ఆ సమున్నత లక్ష్యానికి కాంగ్రెస్ సర్కార్ తూట్లు పొడుస్తోందన్నారు. నాటి కేసీఆర్ విజన్‌కు.. నేటి కాంగ్రెస్ సర్కారు వైఫల్యంతో గ్రహణం పట్టింది.


Similar News