రామాలయంలో ముగిసిన శరన్నవరాత్రి ఉత్సవాలు

భద్రాచలం శ్రీ సీతా రామచంద్ర స్వామి వారి దేవస్థానంలో ఈనెల 4వ తేదీ నుంచి ప్రారంభమైన శరన్నవరాత్రోత్సవాలు శనివారంతో ముగిశాయి.

Update: 2024-10-12 13:13 GMT

దిశ ,భద్రాచలం : భద్రాచలం శ్రీ సీతా రామచంద్ర స్వామి వారి దేవస్థానంలో ఈనెల 4వ తేదీ నుంచి ప్రారంభమైన శరన్నవరాత్రోత్సవాలు శనివారంతో ముగిశాయి. చివరి రోజు మహాలక్ష్మి అలంకారంలో అమ్మవారు దర్శనం ఇవ్వగా..పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకుని కుంకుమ పూజలు నిర్వహించారు. సాయంత్రం శ్రీ స్వామివారు మేళ తాళాలు, మంగళ వాయిద్యాలు, వేదమంత్రాల నడుమ రాజ వీధిలో తిరువీధి సేవగా బయలుదేరి దసరా మండపానికి చేరుకున్నారు. దసరా మండపంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, జమ్మి చెట్టు క్రింద ధనుర్బాణాలు,కత్తి,డాలు లాంటి స్వామివారి ఆయుధాలకు ఆయుధ పూజ నిర్వహించారు. అనంతరం శ్రీరామ లీలా మహోత్సవంలో భాగంగా..చెడుపై మంచి విజయం సాధించింది అనడానికి సూచకంగా బాణసంచాతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రావణాసురుని దహనం నిర్వహించారు. రామాలయం ఈ.వో రమాదేవి అగ్నితో కూడిన విల్లును ఎక్కుపెట్టి రావణాసురునిపై సంధించడంతో బాణాసంచాతో కూడిన రావణాసురుడు దగ్ధం అయ్యాడు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని శ్రీరామ లీలా మహోత్సవాన్ని తిలకించారు.


Similar News