హీరోయిన్ ప్రియాంక మోహన్ కు తృటిలో తప్పిన ప్రమాదం

సరిపోదా శనివారం సినిమా హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.

Update: 2024-10-03 10:17 GMT

దిశ, వెబ్ డెస్క్ : సరిపోదా శనివారం సినిమా హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. తొర్రూరు పట్టణ కేంద్రంలో కాసం షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో ఏర్పాటు చేసిన స్టేజ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో స్టేజీపై ఉన్నవారంతా కిందపడిపోయారు. ఒకరిపై ఒకరు పడిపోవడంతో పలువురికి గాయాలయ్యాయి. అయితే ఈ ప్రమాదంలో హీరోయిన్‌ ప్రియాంక మోహన్ సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే యశస్విని అత్త.. పాలకుర్తి నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి హనుమండ్ల ఝాన్సీ రెడ్డి  గాయపడ్డారు. ఆమె కాలు విరిగింది. దీంతో చికిత్స కోసం ఆమెను హైదరాబాద్ హాస్పిటల్ కు తరలించారు.

హీరోయిన్ చేతుల మీదుగా షోరూంని ప్రారంభించారు. అనంతరం షాపింగ్ మాల్ ముందు ఏర్పాటు చేసిన వేదికపై ఎక్కి వారు ప్రజలకు అభివాదం చేస్తుండగా వేదిక ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. కాగా ప్రమాదానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. తమ అభిమాన హీరోయిన్ ప్రియాంక మోహన్ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడటంతో ఆమె కోసం వచ్చిన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

నాని హీరోగా నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ప్రియాంక అరుళ్ మోహన్ సరిపోదా శనివారం ఘన విజయంతో తెలుగు ప్రేక్షకుల్లో మరింత అభిమానం సంపాదించారు. తెలుగు, తమిళ సినిమాలతో బిజీగా ఉన్న ప్రియాంక మోహన్ ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాల్లో నటిస్తున్నారు. అందులో ఒకటి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఓజీ సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తుండటం విశేషం.


Similar News