సీఎంల భేటీలో ఇంట్రెస్టింగ్ సీన్.. తెలంగాణ ప్రముఖ కవి పుస్తకాన్ని చంద్రబాబుకు గిఫ్ట్‌గా ఇచ్చిన రేవంత్

రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర విభజన సమస్యలపై చర్చించేందుకు

Update: 2024-07-06 13:30 GMT

దిశ, వెబ్‌డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర విభజన సమస్యలపై చర్చించేందుకు హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌కు వచ్చిన టీడీపీ చీఫ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును సీఎం రేవంత్ రెడ్డి శాలువాతో సత్కరించి పుస్తకాన్ని గిఫ్ట్‌గా ఇచ్చారు. తెలంగాణ ప్రముఖ కవి కాళోజి రాసిన ‘‘నా గొడవ’’ బుక్‌ను సీఎం రేవంత్ చంద్రబాబుకు బహుకరించారు. కాగా, నిజాంల కాలం నుండి 1980 వరకు జరిగిన పాలనతో పాటు నిజాం, బ్రిటిషర్ల పాలన మధ్య తేడాలపై కాళోజి నా గొడవ పుస్తకంలో వివరించారు. దీంతో పాటుగా ఏళ్ల తరబడి జరిగిన తెలంగాణ ప్రజా ఉద్యమాల గురించి నా గొడవ పుస్తకంలో అనేక అంశాలను కాళోజి ప్రస్తావించారు. తెలంగాణ ఉద్యమాలకు సంబంధించిన కాళోజి నా గొడవ పుస్తకాన్ని రేవంత్ రెడ్డి చంద్రబాబుకు గిఫ్ట్‌గా ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.

ఇదిలా ఉంటే, గత పదేండ్లుగా అపరిష్కృతంగా ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల విభజన సమస్యల పరిష్కారంపై షెడ్యూల్ ప్రకారం ఆరు గంటలకు భేటీ స్టార్ట్ అయ్యింది. విభజన చట్టంలో గత పదేండ్లుగా అపరిష్కృతంగా ఉన్న అంశాలపై సీరియస్‌గా డిస్కస్ చేస్తున్నారు. ముఖ్యంగా విభజన చట్టంలోని 9, 10వ షెడ్యూల్‌లోని సంస్థల పంపిణీపై చర్చిస్తున్నట్లు టాక్. ఈ భేటీకి తెలంగాణ నుండి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొన్నం, శ్రీధర్ బాబు, సీఎస్ శాంతికుమారి, ఇతర అధికారులు పాల్గొనగా.. ఏపీ నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు పయ్యవుల, అనగాని, జనార్ధన్ రెడ్డి, కందుల దుర్గేష్, సీఎస్ నీరబ్ కుమార్, మరికొందరు ఆఫీసర్లు హాజరయ్యారు. సీఎంల హోదాలో రేవంత్ రెడ్డి, చంద్రబాబుల తొలిసారి మీట్ కావడంతో తెలంగాణతో పాటు ఏపీ పాలిటిక్స్‌లోనూ ఈ భేటీ హాట్ టాపిక్‌గా మారింది.

Tags:    

Similar News