మూసీ ప్రక్షాళనకు లక్షన్నర కోట్లు.. విద్యార్థులకు డబ్బుల్లేవా ?

ఓ వైపు ప్రభుత్వ విద్యను సంపూర్ణంగా నిర్లక్ష్యం చేస్తూ... మరో వైపు ప్రైవేట్ విద్యను కూడా పేద, మధ్యతరగతి విద్యార్థులకు అందకుండా చేస్తుందని ప్రభుత్వంపై కేటీఆర్ ధ్వజమెత్తారు.

Update: 2024-10-15 16:10 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: విద్యారంగాన్ని కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా భ్రష్టు పట్టించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఓ వైపు ప్రభుత్వ విద్యను సంపూర్ణంగా నిర్లక్ష్యం చేస్తూ... మరో వైపు ప్రైవేట్ విద్యను కూడా పేద, మధ్యతరగతి విద్యార్థులకు అందకుండా చేస్తూ వారిని పూర్తిగా విద్యకు దూరం చేసే కుట్ర చేస్తుందని ధ్వజమెత్తారు. వేలాది మంది పేద, మధ్యతరగతి విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించిన గురుకులాలను ఓ వైపు నిర్వీర్యం చేస్తూనే...మరో వైపు ప్రైవేట్ ఉన్నత స్థాయి విద్య విషయంలో అదే వైఖరిని అనుసరిస్తున్నారని ఆరోపించారు. గురుకులాల్లో నాణ్యమైన ఆహారం లేకుండా చేసి భద్రత పరంగా విద్యార్థులను భయాందోళనకు గురి చేశారన్నారు. అది చాలదన్నట్లుగా గురుకుల భవనాలకు కనీసం అద్దె కూడా చెల్లించకుండా స్కూల్స్ కు వాటి యాజమానులు తాళాలు వేసి దుస్థితి తెచ్చారన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి దుస్థితిని చూడలేదన్నారు.

ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో విద్యార్థులు నష్టపోయే పరిస్థితి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. చదువు పూర్తి అయిన విద్యార్థులను ఫీజు బకాయిలు చెల్లించాలంటూ సర్టిఫికెట్లను ఇవ్వకుండా కాలేజీ యాజమాన్యాలు ఇబ్బంది పెడుతున్నారన్నారు. అటు బకాయిల కోసం కాలేజీ యాజమాన్యాలు, ఇటు స్కాలర్ షిప్ లు, ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం విద్యార్థులు రోడ్లపై ధర్నాలు చేస్తుంటే ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందన్నారు. లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో ముడిపడి ఉన్న అంశంలో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. మూసీ సుందరీకరణ కోసం రూ. లక్షా 50 వేల కోట్లు ఖర్చు చేస్తామని చెబుతున్న ప్రభుత్వం వద్ద పేద, మధ్య తరగతి విద్యార్థులు చదువు కొనసాగించేందుకు అయ్యే డబ్బు లేదా అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయంలో అంతకుముందు ప్రభుత్వం బకాయిలు పెట్టిన రూ. 2 వేల కోట్ల ఫీజు బకాయిలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం చెల్లించిదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి విద్యార్థుల విషయంలో ఏమాత్రం చిత్తశుద్ది ఉన్న కాలేజీ యాజమాన్యాలతో చర్చలు జరిపి వారికి బకాయిలు చెల్లించేదన్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజ్ లు నిరవధికంగా బంద్ ప్రకటించిన ముఖ్యమంత్రిలో చలనం లేదని విమర్శించారు. విద్యార్థులకు నష్టం చేస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ సహించదని హెచ్చరించారు. రెండు మూడ్రోజుల్లో సమస్యను పరిష్కరించకుంటే ప్రభుత్వం ఒత్తిడి పెంచేలా విద్యార్థులతో కలిసి పోరాటాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

పార్టీలో యువతకు పెద్దపీట

బీఆర్ఎస్ పార్టీలో యువతకు పెద్దపీట వేయనున్నట్లు కేటీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ లోని నందినగర్ లో మంగళవారం పార్టీ యువనేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలులో వైఫల్యాలను ఎండగట్టాలన్నారు. ప్రజలను ఎప్పటికప్పుడు చైతన్యం చేయాల్సిన బాధ్యత యువనేతలపై ఉందన్నారు. పనిచేసేవారికి పార్టీలో తగిన గుర్తింపు ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, బీసీ కమిషన్ మాజీ సభ్యులు కె.కిశోర్ గౌడ్, శుభప్రద్ పటేల్, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు బాలరాజుయాదవ్, గెల్లు శ్రీనివాస్, బీఆర్ఎస్వీ నాయకుడు తుంగబాలు తదితరులు పాల్గొన్నారు.


Similar News