BRS: నేతల హౌజ్ అరెస్టులు దుర్మార్గమైన చర్య.. ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్

Update: 2024-10-23 06:13 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ నేతల హౌజ్ అరెస్టులు దుర్మార్గమైన చర్య అని, ముందస్తు అరెస్టులు సర్కారు అణచివేత విధానాలకు నిదర్శనమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రామన్నపేటలో అంబుజా సిమెంట్ ఫాక్టరీ నిర్మాణం కోసం ప్రజాభిప్రాయ సేకరణ జరగనుంది. దీనికోసం బయలుదేరిన నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ నేతలను పోలీసులు హౌజ్ అరెస్టులు చేశారు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన కేటీఆర్.. ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. రామన్నపేటలో దొంగచాటుగా నిర్మించ తలపెట్టిన అదానీ-అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీపై నిర్వహిస్తున్న పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణకు బీఆర్ఎస్ నేతలు వెళ్లకుండా ఎక్కడికక్కడ అడ్డుకోవడం, హౌజ్ అరెస్టులు చేయడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. నల్గొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ నాయక్, మాజీ ఎమ్మెల్యేలు భూపాల్ రెడ్డిని హౌజ్ అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. అలాగే మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిషోర్ కుమార్, చిరుమర్తి లింగయ్యలు ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడం నియంతృత్వం కాక మరేంటని ప్రశ్నించారు.

అంతేగాక వీరితోపాటు ప్రజాసంఘాల ప్రతినిధులు, పర్యావరణవేత్తలను ముందస్తు అరెస్టులు చేసి భయబ్రాంతులకు గురిచేయడం రేవంత్ సర్కారు అణచివేత విధానాలకు నిదర్శనమని దుయ్యబట్టారు. ఇంతటి నిర్బంధ పరిస్థితులను సృష్టించి నిర్వహించే పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణకు విలువ ఉండదని, ఇది ముమ్మాటికీ అదానీ ఆదేశాలతో ముఖ్యమంత్రి రేవంత్ సాగిస్తున్న అరాచక పర్వమని ఆరోపించారు. ఇక అక్రమంగా నిర్బంధించిన బీఆర్ఎస్ నాయకులతోపాటు ప్రజాసంఘాల నేతలను వెంటనే విడుదల చేయాలని, కాంగ్రెస్ సర్కారుకు దుమ్ముంటే ఎలాంటి నిర్బంధాలు లేకుండా ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని డిమాండ్ చేశారు. అప్పుడే గుండెపగిలిన రైతుల ఆవేదన, చుట్టుపక్కల ప్రజల ఆక్రందన ఏ స్థాయిలో ఉందో తెలుస్తుందని, నియంతృత్వ విధానాలతో ప్రజాభిప్రాయ సేకరణను మమ అనిపించి అదానీ సిమెంట్ ఫ్యాక్టరీ విషయంలో ముందుకెళ్లే ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ సర్కారుకు ప్రజలే మరణశాసనం రాస్తారని కేటీఆర్ హెచ్చరించారు. 

Tags:    

Similar News