పదవ తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి.. విద్యాశాఖ కీలక ప్రకటన
రాష్ట్రవ్యాప్తంగా పదవ తరగతి పరిక్షలు ఈ నెల 21 నుంచి వచ్చే నెల 4 వరకు జరగనున్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా పదవ తరగతి పరిక్షలు ఈ నెల 21 నుంచి వచ్చే నెల 4 వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షల నిర్వహణకు సంబంధించి విద్యాశాఖ పకడ్భందీగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ పరిక్షలకు సంబంధించి హాల్ టిక్కెట్లను కూడా పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో తీసుకువచ్చింది. మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు జరిగే ఈ పరీక్షలకు 5,09,403 మంది విద్యార్ఢులు హజరుకానున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2,650 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షల అనంతరం జవాబు పత్రాల మూల్యాంకనం ఏప్రిల్ 7 నుంచి 15 వరకు జరగనుంది. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాల నిఘా ఉంటుంది. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.