సంక్షేమ రంగానికి పెద్దపీట
ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో దీర్ఘకాలిక అభివృద్ధి, సంక్షేమం, వ్యవసాయం, మౌలిక సదుపాయాల కల్పన, ఉపాధి కల్పన

ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో దీర్ఘకాలిక అభివృద్ధి, సంక్షేమం, వ్యవసాయం, మౌలిక సదుపాయాల కల్పన, ఉపాధి కల్పన వంటి ప్రాధాన్యత అంశాల మేళవింపే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరు గ్యారంటీల అమలుకై ఈ బడ్జెట్లో నిధులు కేటాయించారు..
బడ్జెట్లో సంక్షేమ రంగానికి పెద్దపీట వేస్తూ వ్యవసాయం, మౌలిక సౌకర్యాలు, ఉపాధి కల్పనలకు ప్రాధాన్యత ఇచ్చారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ₹64,539 కోట్ల బహిరంగ మార్కెట్ రుణాలతో సహా దాదాపు ₹70,000 కోట్ల అంచనా వేయబడిన రుణాలపై రాష్ట్రం నిరంతర ఆధారపడటాన్ని బడ్జెట్ ప్రతిబింబిస్తుంది. దీనిని బట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో మనకు అర్థం అవుతుంది.
బీసీ, ఎస్సీ, ఎస్టీలకే సింహభాగం
వ్యవసాయం ₹24,439 కోట్లు, పంచాయతీ రాజ్ ₹31,605 కోట్లు, విద్య ₹23,108 కోట్లకి వార్షిక బడ్జెట్లో ప్రధాన కేటాయింపులు చేశారు. వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల సంక్షేమానికి కేటాయింపులు జరిపారు. బీసీ సంక్షేమం అకౌంటింగ్ ₹11,405 కోట్లు, SC సంక్షేమం ₹40,232 కోట్లు, ST సంక్షేమం ₹17,169 కోట్లు మొత్తం కేటాయింపులు ₹69,000 కోట్లతో సింహభాగం కేటాయింపులు జరిగాయి. వైద్య రంగానికి ఈ బడ్జెట్లో ₹12,393 కోట్లు కేటాయించారు. గత సంవత్సరం ₹ 11,500 కోట్లతో పోల్చుకుంటే పెరుగుదల స్వల్పం. అయితే రాష్ట్రంలో 56.39% ఉన్న బీసీలకు ఈ బడ్జెట్లో కేవలం ₹11,405 కోట్ల నిధులు మాత్రమే కేటాయించడం విచారకరం. 56.39% ఉన్న బీసీలకి బడ్జెట్ కేవలం 3.73% నిధులే కేటాయించడం ద్వారా బీసీ సంక్షేమం,అభివృద్ధి, సాధికారత లా సాధ్యమవుతుందని విమర్శలు వస్తున్నాయి.
అంకెల్లో పెరిగినా..
విద్యపై పెట్టిన సొమ్మును భవిష్యత్తుకి పెట్టుబడిగా చూడాలి కానీ గత దశాబ్ద కాలంగా విద్యారంగానికి కేటాయింపులు తగ్గుతూ వస్తున్నాయి. మానవాభివృద్ధి సూచికలో ప్రధాన భూమిక పోషించే విద్య, వైద్య రంగాలకు ఈసారి కేటాయింపులు నామమాత్రంగానే జరిగాయి. 2014-15 లో 10.89%గా ఉన్న విద్యా రంగ కేటాయింపులు ఈ సంవత్సరం 7. 57% మాత్రమే. ఈ కేటాయింపుల్లో కూడా పాఠశాల విద్యకు కేటాయింపులు తగ్గాయి. తెలంగాణ బడ్జెట్లో విద్యారంగానికి ₹23,108 (7.57%) కోట్లు కేటాయించారు. దేశంలోని టాప్ 20 రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి అత్యల్పంగా నిధులను కేటాయించింది. ఢిల్లీ 21.1%, కర్ణాటక 11%, ఆంధ్రప్రదేశ్(12.6%), కేరళ(14%), తమిళనాడు(14.1%) రాష్ట్రాలు విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకి మనకన్నా అత్యధిక నిధులు కేటాయించాయి. దేశంలో ఈశాన్య రాష్ట్రాలు కూడా విద్యకు దాదాపు 12 నుండి 13 శాతం వరకు బడ్జెట్ కేటాయింపులు చేస్తున్నాయి. విద్యాశాఖకు గత ఏడాది కంటే ఈ సారి 0.20% కేటాయింపులు తగ్గాయి. ₹304,965 కోట్ల బడ్జెట్లో విద్యకు కేటాయించింది ₹23,108 కోట్లు (7.57%). గత సంవత్సరం ₹ 2,74,058 కోట్ల బడ్జెట్లో విద్యకు కేటాయించింది ₹ 21,292 కోట్లు (7.77%) అంకెల్లో రూ 1,816 కోట్లు పెరిగినట్లుగా ఉన్నప్పటికీ శాతాల్లో చూస్తే గత సంవత్సరం కంటే తగ్గింది.
విద్యకు కేటాయింపులు పెంచాలి
విద్యకు 15% నిధులు బడ్జెట్లో కేటాయించి, ప్రభుత్వ బడులను పటిష్టం చేసి రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్యను అందిస్తామని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం విద్యకు కేవలం 7.57% మాత్రమే బడ్జెట్లో కేటాయింపులు చేసింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో విద్యకు కేటాయించిన సగటు బడ్జెట్ 14.7%లో ఈ కేటాయింపులు సగం మాత్రమే అని మనం గమనించాలి. ఈ కేటాయింపుల్లో కూడా సింహభాగం జీతాలకే ఉంటాయి. యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్కి ₹2900 కోట్లు ఈ కేటాయింపుల్లో ఉన్నాయి. విద్యాశాఖ పరిధిలో ఉన్న 26,067 పాఠశాలలను గాలికొదిలేసి, రెసిడెన్షియల్, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ గురించి మాత్రమే ప్రభుత్వం మాట్లాడుతున్నది. గురుకులాల్లో చదివేది 5.5 లక్షల మంది మాత్రమే. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలలో చదివే విద్యార్థులు 16 లక్షలు.. వారిలో అత్యధికులు బడుగు బలహీన వర్గాల వారు. వీరికి నాణ్యమైన విద్య అందించడానికి ఈ కేటాయింపులు ఏమాత్రం సరిపోవు. విద్యాశాఖ పరిధిలోని పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు, మెరుగైన మధ్యాహ్న భోజనం అందించేందుకు, నాణ్యమైన విద్యను అందించడానికి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా విద్యకు కనీసం 15% నిధులు కేటాయించాలి.
అప్పుడే వృద్ధి పథంలో తెలంగాణ
మానవాభివృద్ధి సూచికలో 2022 లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రం దేశంలో 22వ స్థానంలో ఉంది. విద్య వైద్యానికి పెద్దపీట వేసిన రాష్ట్రాలు కేరళ, గోవా, ఢిల్లీ అభివృద్ధి సూచికలో ముందు వరుసలో ఉన్నాయి. ప్రజల జీవన ప్రమాణాలు పెరిగేలా సంక్షేమ పథకాల రూపొందిస్తూ విద్య వైద్య రంగాలకు రాబోయే ఐదు సంవత్సరాల్లో కేటాయింపులు మరింత పెంచాల్సిన అవసరం ఉంది. అప్పుడే మానవ అభివృద్ధి సూచికలో మన రాష్ట్రం మరింత ముందుకు వెళ్తుంది. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథాన పయనిస్తుంది.
పాకాల శంకర్ గౌడ్
98483 77734