యూఎస్ ఓపెన్‌లో క్వార్టర్స్‌కు దూసుకెళ్లిన గాయత్రి జోడీ

యూఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత డబుల్స్ స్టార్ షట్లర్లు గాయత్రి గోపిచంద్, ట్రీసా జాలీ మహిళల డబుల్స్‌లో క్వార్టర్స్‌కు దూసుకెళ్లారు.

Update: 2024-06-28 15:00 GMT

దిశ, స్పోర్ట్స్ : అమెరికాలోని టెక్సాస్‌లో జరుగుతున్న యూఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత డబుల్స్ స్టార్ షట్లర్లు గాయత్రి గోపిచంద్, ట్రీసా జాలీ మహిళల డబుల్స్‌లో క్వార్టర్స్‌కు దూసుకెళ్లారు. శుక్రవారం జరిగిన రెండో రౌండ్‌లో గాయత్రి-ట్రీసా జోడీ 16-21, 21-11, 21-19 తేడాతో చైనీస్ తైపీకి చెందిన హ్సీప్ పీ షాన్-హంగ్ ఎన్ ట్జు జంటపై విజయం సాధించింది. గెలుపు కోసం భారత జంట శ్రమించాల్సి వచ్చింది. మ్యాచ్‌లో మొదట గాయత్రి జోడీకి శుభారంభం దక్కలేదు. చైనీస్ తైపీ జంట తొలి గేమ్‌లో షాకిచ్చింది. ఆ తర్వాత బలంగా పుంజుకున్న భారత షట్లర్లు వరుసగా రెండు గేమ్‌లను నెగ్గి మ్యాచ్‌ను ముగించారు.

సింగిల్స్‌లో ప్రియాన్షు రజావత్, మాళవిక బాన్సోద్ క్వార్టర్స్‌కు చేరుకున్నారు. మెన్స్ సింగిల్స్ రెండో రౌండ్‌లో ప్రియాన్షు 21-18, 21-16 తేడాతో హువాంగ్ యు కై(చైనీస్ తైపీ)ని ఓడించాడు. అలాగే, ఉమెన్స్ సింగిల్స్ రెండో రౌండ్‌లో మాళవిక 15-21, 21-19, 21-14 తేడాతో తెరెజా స్వాబికోవా(చెక్ రిపబ్లిక్)పై పోరాడి గెలిచింది. మరోవైపు, మెన్స్ డబుల్స్‌లో కృష్ణ ప్రసాద్-సాయి ప్రతీక్ జోడీ రెండో రౌండ్‌లో ఓడి టోర్నీ నుంచి నిష్ర్కమించింది. 

Similar News