క్వార్టర్స్లో భారత జట్టు ఓటమి
బ్యాడ్మింటన్ ఆసియా జూనియర్ చాంపియన్షిప్స్ టోర్నీలో టీమ్ ఈవెంట్లో భారత్ పోరాటం ముగిసింది.
దిశ, స్పోర్ట్స్ : ఇండోనేషియాలో జరుగుతున్న బ్యాడ్మింటన్ ఆసియా జూనియర్ చాంపియన్షిప్స్ టోర్నీలో టీమ్ ఈవెంట్లో భారత్ పోరాటం ముగిసింది. సోమవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత జట్టు 2-3 తేడాతో మలేషియా చేతిలో పరాజయం పాలైంది. మ్యాచ్లో మొదట భారత్కు అదిరిపోయే ఆరంభం దక్కింది. మిక్స్డ్ డబుల్స్లో సంస్కార్ సరస్వత్-శ్రావణి జోడీ, ఉమెన్స్ సింగిల్స్లో తన్వీ శర్మ నెగ్గడంతో భారత్ 2-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత జట్టు ఆ జోరును కొనసాగించలేకపోయింది. మిగతా మూడు గేమ్ల్లో ఓడి పోయి మూల్యం చెల్లించుకుంది. మెన్స్ సింగిల్ష్లో ప్రణయ్ ఓడిపోగా.. ఉమెన్స్ డబుల్స్లో నవ్య-శ్రావణి, మెన్స్ డబుల్స్లో భార్గవ్ రామ్-అర్ష్ జంటలు నిరాశపరిచాయి. ఈ టోర్నీలో బుధవారం నుంచి వ్యక్తిగత ఈవెంట్ ప్రారంభంకానుంది. టీమ్ ఈవెంట్లో బరిలోకి దిగిన భారత షట్లర్లే వ్యక్తిగత ఈవెంట్లో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇప్పటివరకు భారత్ నుంచి పీవీ సింధు(2012, గర్ల్స్ సింగిల్స్), లక్ష్యసేన్(2018, బాయ్స్ సింగిల్స్) మాత్రమే స్వర్ణ పతకాలు దక్కించుకున్నారు.