'41 మందిని రక్షిస్తే చెరో 50వేలే ఇచ్చారు'.. ఉత్తరాఖండ్ సర్కార్పై ‘ర్యాట్ హోల్’ మైనింగ్ టీమ్ అసంతృప్తి
డెహ్రాడూన్ : ఇటీవల ఉత్తరాఖండ్లోని సిల్క్యారా టన్నెల్లో 41 మంది కార్మికులు వారాల తరబడి చిక్కుకుపోతే ‘ర్యాట్ హోల్’ మైనింగ్ టీమ్ రక్షించిన సంగతి తెలిసిందే. ఆ టీమ్లోని 12 మంది సభ్యులకు ఇటీవల ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ రూ.50 వేలు చొప్పున చెక్కులు అందించి సత్కరించారు. అయితే ఈ రెస్క్యూ ఆపరేషన్లో తాము పోషించిన పాత్రకు.. ప్రభుత్వం చేసిన సాయానికి పొంతన లేకుండా ఉందని ‘ర్యాట్ హోల్’ మైనింగ్ నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం ఇచ్చిన చెక్కులను తిరిగి ఇచ్చేస్తామని వారు వెల్లడించారు. శాశ్వత ఉద్యోగం లేదా నివసించడానికి ఇల్లు కల్పించడంపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం నుంచి ప్రకటన రాకుంటే తమకు ఇచ్చిన చెక్కులను వాపస్ చేస్తామని తేల్చి చెప్పారు. నవంబరు 12న 41 మంది కార్మికులు సొరంగంలో చిక్కుకుపోగా.. ‘ర్యాట్ హోల్’ మైనింగ్ టీమ్ రెస్క్యూ వర్క్తో నవంబరు 28న వారంతా బయటికి వచ్చారు.