Karnataka Minister: పాలస్తీనా జెండా పట్టుకోవడంతో తప్పేముంది?.. కన్నడ మంత్రి వివాదాస్ప వ్యాఖ్యలు

పాలస్తీనా జెండాలతో యువకులు కన్పించిన ఘటనపై కర్ణాటక మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-09-20 06:35 GMT

దిశ, నేషనల్ బ్యూరో: పాలస్తీనా జెండాలతో యువకులు కన్పించిన ఘటనపై కర్ణాటక మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాలస్తీనాకు మద్దతిచ్చేందుకు ఆ జెండా పట్టుకోవడంలో తప్పు లేదని కర్ణాటక హౌసింగ్, వక్ఫ్, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ అన్నారు. కర్ణాటకలోని చిత్రదుర్గ, దావణగెరె, కోలార్ జిల్లాల్లో సోమవారం మిలాద్-ఉల్-నబీ ఊరేగింపు సందర్భంగా పాలస్తీనా జెండాలు రెపరెపలాడాయి. ఈ ఘటన జరిగిన రెండ్రోజులకే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అంతేకాకుండా బీజేపీపై మంత్రి విరుచుకుపడ్డారు. ఈ అంశాలపై బీజేపీ ఎందుకు రచ్చ చేస్తుందని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పాలస్తీనాకు మద్దతు పలికిందని గుర్తుచేశారు. పాలస్తీనాకు మద్దతిస్తున్నామని ప్రకటించిన బీజేపీ.. దీన్ని పెద్ద సమస్యగా ఎందుకు మారుస్తోంది? అని అడిగారు. మరొక దేశానికి అనుకూలంగా నినాదాలు చేసే వ్యక్తిని దేశద్రోహిగా పరిగణించి జీవితాంతం జైలులో పెట్టాలని అన్నారు. అయితే, కేవలం జెండా పట్టుకోవడంలో తప్పు లేదని జమీర్ అహ్మద్ ఖాన్ వారించారు.

పాలస్తీనాకు మద్దతు

గత ఏడాది అక్టోబర్‌లో, పాలస్తీనా "సార్వభౌమ, స్వతంత్ర, ఆచరణీయ" రాజ్య స్థాపనకు మద్దతు ఇస్తున్నట్లు భారత్ ప్రకటించింది. కాగా.. కేంద్రం పాలస్తీనాకు మద్దతు ప్రకటించిన తర్వాతే ప్రజలు ఆ జెండాలు పట్టుకోవడం ప్రారంభించారని అన్నారు. పాలస్తీనాకు మోడీ సర్కారు మద్దతు ఇవ్వకపోతే.. వారు ఈ జెండాలు పట్టుకుని ఉండేవారు కాదని అన్నారు. ఇకపోతే, చిక్ మంగళూరులో పాలస్తీనా జెండాను పట్టుకుని ద్విచక్రవాహనాలను నడుపుతున్నట్లు చూపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈకేసులో ఆరుగురు మైనర్లను అధికారులకు అదుపులోకి తీసుకున్నారు. దీనిపైనే, మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.


Similar News