Meghalaya: సీఎం ఆఫీస్పై రాళ్లదాడి.. భద్రతా సిబ్బందికి గాయాలు
తురా టౌన్లో ఉన్న మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది.
షిల్లాంగ్ : తురా టౌన్లో ఉన్న మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. తురా టౌన్లో రాష్ట్ర శీతాకాల రాజధానిని ఏర్పాటు చేయాలనే డిమాండ్తో నిరాహార దీక్ష చేపట్టిన గారో హిల్స్ పౌర సంఘాల నేతలతో సీఎం సోమవారం సాయంత్రం చర్చిస్తుండగా.. కొందరు వ్యక్తులు రాళ్లు రువ్వడంతో కలకలం రేగింది. ఈ దాడిలో ఐదుగురు సీఎం భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. సీఎం కాన్రాడ్ సంగ్మా క్షేమంగానే ఉన్నారు. కొందరు ఆందోళనకారులు సీఎం ఆఫీసు ఉన్న రోడ్డును బ్లాక్ చేశారు.
దీంతో సీఎంతో పాటు ఓ మంత్రి కార్యాలయంలోనే ఉండిపోయినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో పరిస్థితిని అదుపులోకి తెచ్చేటందుకు పోలీసులు టియర్ గ్యాస్ను ప్రయోగించారు. ఆందోళనకారులను చెదరగొట్టడానికి లాఠీఛార్జ్ చేశారు. రాళ్లు రువ్విన వ్యక్తులకు పౌరసంఘాలతో సంబంధం లేదని తెలుస్తోంది. తాజా పరిస్థితుల దృష్ట్యా ఆగస్టు 8 లేదా 9 తేదీల్లో షిల్లాంగ్లో చర్చలకు రావాలని పౌరసంఘాల ప్రతినిధులను సీఎం కాన్రాడ్ సంగ్మా ఆహ్వానించారు.