Military exercise: భారత్, సింగపూర్ వైమాణిక దళాల సైనిక విన్యాసాలు..12వ ఎడిషన్ ప్రారంభం
ఇండియన్ ఎయిర్ ఫోర్స్, రిపబ్లిక్ ఆఫ్ సింగపూర్ వైమాణిక దళం మధ్య సంయుక్త సైనిక శిక్షణా వ్యాయామం 12వ ఎడిషన్ ప్రారంభమైంది.
దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమ బెంగాల్లోని కలైకుండ ఎయిర్ఫోర్స్ స్టేషన్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్), రిపబ్లిక్ ఆఫ్ సింగపూర్ వైమాణిక దళం(ఆర్ఎస్ఏఎఫ్)ల మధ్య సంయుక్త సైనిక శిక్షణా వ్యాయామం(జేఎంటీ)12వ ఎడిషన్ సోమవారం ప్రారంభమైంది. రెండు దళాలు అధునాతన వైమాణిక పోరాటాలు, జాయింట్ మిషన్ ప్లానింగ్లలో పాల్గొంటున్నందున ఇరు సైన్యాల మధ్య సహకారాన్ని పెంపొందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. వచ్చే నెల 13 నుంచి 21 వరకు దైపాక్షిక వ్యాయామం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఇరు పక్షాల పోరాట సంసిద్ధతను పెంచడానికి ఈ శిక్షణ తోడ్పడనున్నట్టు భావిస్తున్నారు. ఐఏఎఫ్కి చెందిన రఫెల్, మిరాజ్ 2000, సుఖోయ్-30 ఎంకేఐ, తేజస్, మిగ్-29, జాగ్వార్ ఎయిర్క్రాఫ్ట్లు ఈ విన్యాసాల్లో భాగంగా ఉండగా.. ఆర్ఎస్ఏఎఫ్ తరఫున ఎఫ్-16, ఎఫ్-15 స్వ్కాడ్రన్ ల సహాయక సిబ్బంది, జీ-550 ఎయిర్బోర్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్, సీ-130 విమానాలు పాల్గొననున్నాయి. కాగా, ‘జేఎంటీ 2024 ఉమ్మడి వ్యాయామం సింగపూర్, భారత్ల మధ్య బలమైన ద్వైపాక్షిక రక్షణ సంబంధాలు బలోపేతం చేస్తుందని’ రక్షణ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.