హస్తినలో ఆల్‌టైం హైకి చేరిన విద్యుత్ డిమాండ్.. ఎంతంటే..

దేశ రాజధాని ఢిల్లీలో ఎండల ప్రభావం ఇంకా తగ్గలేదు. ఉష్ణోగ్రతలు 47 డిగ్రీల సెల్సియస్‌కు దగ్గరగా నమోదవుతున్నాయి

Update: 2024-06-18 13:25 GMT

దిశ, నేషనల్ బ్యూరో: దేశ రాజధాని ఢిల్లీలో ఎండల ప్రభావం ఇంకా తగ్గలేదు. ఉష్ణోగ్రతలు 47 డిగ్రీల సెల్సియస్‌కు దగ్గరగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో తీవ్రమైన వేడి గాలుల నుంచి ఉపశమనం పొందడానికి ఎయిర్ కండిషనర్లు, ఫ్యాన్లు, కూలర్లు వంటి వాటిని ఎక్కువగా ఉపయోగించడం వలన మంగళవారం ఢిల్లీలో విద్యుత్ వినియోగ డిమాండ్ గరిష్ట స్థాయి 8,647 మెగావాట్లకు చేరుకుంది. ఇది ఆల్‌టైం హై అని అధికారులు తెలిపారు. డేటా ప్రకారం, మంగళవారం రోజు మధ్యాహ్నం 3:22 గంటలకు ఢిల్లీలో గరిష్ట విద్యుత్ డిమాండ్ 8,647 మెగావాట్లుగా నమోదైంది.

దీనికి ముందు మే 22, 2024న, ఢిల్లీ గరిష్ట విద్యుత్ వినియోగం మొదటిసారిగా 8000 మెగావాట్లకు చేరుకుంది. అప్పటి నుంచి కూడా ఎండల ప్రభావం మరింత తీవ్రం కావడంతో ప్రజలు సేద తీరడానికి కూలింగ్ సాధానాల కోసం ఎక్కువ విద్యుత్ వాడుతున్నారు. దీంతో ఎనిమిది సార్లు గరిష్ట విద్యుత్ వినియోగం 8000 మెగావాట్లు దాటినట్లు డేటా పేర్కొంది. ఇదిలా ఉంటే జూన్ 19న హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా-చండీగఢ్-ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, బీహార్, జార్ఖండ్‌లోని కొన్ని ప్రాంతాల్లో వేడిగాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. దేశ రాజధానిలో ప్రస్తుతం 'రెడ్' అలర్ట్ ఉంది, మంగళవారం గరిష్ట ఉష్ణోగ్రత 45 డిగ్రీల సెల్సియస్‌ వరకు నమోదు అయినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

Similar News