పన్నూన్ కేసు దర్యాప్తులో పారదర్శకత అవసరం: అమెరికా
ఖలిస్థానీ వేర్పాటు వాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ను హతమార్చేందుకు భారత్ కుట్ర పన్నిందని అమెరికా పలు మార్లు ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై ప్రస్తుతం భారత్ దర్యాప్తు చేస్తోంది.
దిశ, నేషనల్ బ్యూరో: ఖలిస్థానీ వేర్పాటు వాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ను హతమార్చేందుకు భారత్ కుట్ర పన్నిందని అమెరికా పలు మార్లు ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై ప్రస్తుతం భారత్ దర్యాప్తు చేస్తోంది. అయితే ఈ కేసు విచారణలో పాదర్శకతను కోరుకుంటున్నట్టు అమెరికా విదేశాంగ శాఖ డిప్యూటీ సెక్రటరీ కర్ట్ క్యాంప్బెల్ తెలిపారు. యూఎస్ జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలివన్ భారత పర్యటనపై నిర్వహించిన వర్చువల్ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘మేము భారత ప్రభుత్వం నుంచి జవాబుదారీతనం కోరుతున్నాం. భారత విచారణ కమిటీ పరిశోధనలపై ఎప్పటికప్పుడు అప్డేట్లను అందించాలి. ఈ సమస్యను నేరుగా భారత ప్రభుత్వంతో లేవనెత్తాం’ అని చెప్పారు. సమగ్ర విచారణ జరిపి వివరాలు వెల్లడించాలన్నారు. కాగా, గతేడాది నవంబర్లో న్యూయార్క్లో పన్నూన్ను చంపడానికి భారత ప్రభుత్వ ఉద్యోగితో కలిసి పనిచేశాడని నిఖిల్ గుప్తాపై ఆరోపణలు వచ్చాయి. అమెరికా ఆరోపణల నేపథ్యంలో దీనిపై విచారణక భారత్ ఉన్నత స్థాయి విచారణ కమిటీని నియమించింది. పన్నూన్ కు అమెరికా, కెనడాల పౌరసత్వం ఉంది.