Bomb threat: దేశంలోని సీఆర్పీఎఫ్ స్కూళ్లకు బెదిరింపులు
ఢిల్లీ రోహణిలోని పేలుడు ఘటన మర్చిపోకముందే మరోసారి సీఆర్పీఎఫ్ బెదిరింపులు వచ్చాయి. దేశంలోని అన్ని సీఆర్పీఎఫ్ స్కూళ్లకు ఈమెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చాయి.
దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ రోహణిలోని పేలుడు ఘటన మర్చిపోకముందే మరోసారి సీఆర్పీఎఫ్ బెదిరింపులు వచ్చాయి. దేశంలోని అన్ని సీఆర్పీఎఫ్ స్కూళ్లకు ఈమెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. భయాందోళనలు సృష్టించడానికి ఈమెయిల్ ఎవరో చేసిన దుశ్చర్యగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఢిల్లీతో సహా అన్ని పాఠశాలల్లో ఈ బెదిరింపులు భయాందోళనలను రేకెత్తించింది. నైట్రేట్ ఆధారిత పేలుడు పదార్థాలను తరగతి గదుల్లో అమర్చినట్లు దుండగుడు మెయిల్ లో పేర్కొన్నాడు. ఉదయం 11 గంటలలోగా అన్ని పాఠశాలలను ఖాలీ చేయాలని అన్నాడు. కాగా.. ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
రోహిణిలో పేలుడు
ఇదిలా ఉంటే.. ఆదివారం ఉదయం ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో ఉన్న సీఆర్పీఎఫ్ పాఠశాల సమీపంలో భారీ పేలుడు సంభవించింది. పేలుడు తీవ్రతకు ఆ ప్రాంతంలో దట్టమైన పొగ వ్యాపించింది. పాఠశాల గోడ కూలిపోవడంతోపాటు సమీపంలో ఉన్న దుకాణాలు, కార్లు దెబ్బతిన్నాయి. సమీపంలోని మట్టి, అక్కడ గుర్తించిన తెల్లని పౌడర్ నమూనాలనూ ల్యాబ్కు పంపించారు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), జాతీయ భద్రతా దళం (ఎన్ఎస్జీ) ఘటనా స్థలానికి చేరుకుని తనిఖీలు చేపట్టాయి. ఇక్కడ ఎన్ఎస్జీ రోబోలను మోహరించింది.