Supreme Court: ఉత్తరప్రదేశ్ లోని ‘ఆపరేషన్ బుల్డోజర్’పై సుప్రీంకోర్టు ఆగ్రహం
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన బుల్డోజర్ చర్యలపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన బుల్డోజర్ చర్యలపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. యూపీలోని బహ్రెయిచ్లో ‘ఆపరేషన్ బుల్డోజర్’ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం యోగి సర్కారు పై ఫైర్ అయ్యింది. కోర్టు ఆదేశాల్ని ధిక్కరిస్తే చర్యలు కఠినంగా ఉంటాయంటూ పరోక్షంగా సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. “అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను ఉల్లంఘించాలనుకుంటే అది ప్రభుత్వం నిర్ణయం. అయితే, కూల్చివేతలను ఎదుర్కొంటున్న నిర్మాణాలు చట్ట విరుద్ధమైతే, మేం జోక్యం చేసుకోబోం” అని ధర్మాసనం పేర్కొంది.
హింసాత్మకంగా మారిన బుల్డోజర్ ఆపరేషన్
ఇకపోతే, స్థానిక అధికారులు అక్టోబర్ 13న బహ్రెయిచ్ లో ఆపరేషన్ బుల్డోజర్పై నోటీసులు జారీ చేశారు. ఆ తర్వాత జరిగిన బుల్డోజర్ చర్యల కారణంగా మత ఘర్షణలు జరిగాయని, ఓ వ్యక్తి సైతం ప్రాణాలు కోల్పోయారని కోర్టుకు పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. మరోవైపు, బహ్రెయిచ్ లో ప్రభుత్వ బుల్డోజర్ చర్యలపై ఇప్పటికే సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యామయి. ఆ పిటిషన్లపై సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టనుంది. అంతేకాకుండా.. విచారణ నేపథ్యంలో ఎలాంటి బుల్డోజర్ చర్యలకు ఉపక్రమించొద్దని సుప్రీం ధర్మాసనం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది