సరికొత్త లోగోతో బీఎస్ఎన్ఎల్ కదనోత్సాహం

ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) పూర్వ వైభవ సాధన లక్ష్యంగా సరికొత్త సంస్కరణలతో జోష్ కొనసాగిస్తోంది.

Update: 2024-10-22 11:12 GMT

దిశ, వెబ్ డెస్క్ : ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) పూర్వ వైభవ సాధన లక్ష్యంగా సరికొత్త సంస్కరణలతో జోష్ కొనసాగిస్తోంది. ఇటీవల జియో, ఎయిర్‌టెల్, వీ వంటి ప్రైవేటు రంగ టెలికం ఆపరేటర్లు టారీఫ్ రేట్లను పెంచిన నేపథ్యంలో చాలా మంది యూజర్లు బీఎస్ఎన్‌ఎల్‌లోకి పోర్ట్ అయ్యారు. దీంతో సంస్థకు పెరిగిన ఆదరణను మరింత పదిలం చేసుకొని మరింత ప్రగతి దిశగా పురోగమించేందుకు పలు, మార్పులు, చేర్పులు, సరికొత్త ఆఫర్లతో వినియోగదారుల ముందకొస్తోంది. అందులో భాగంగా దేశవ్యాప్తంగా 4జీ నెట్‌వర్క్ విస్తరణ, 5జీ ప్రారంభానికి ముందు సరికొత్త లోగోతో బీఎస్ఎన్ఎల్ యూజర్ల ముందుకొచ్చింది. ఇదివరకు రెడ్, బ్లూ రంగుల్లో ఉండే వక్ర రేఖలను జాతీయ జెండా రంగులను పోలిన ఆకుపచ్చ, తెలుపు రంగుల్లోకి మార్చింది. భారతదేశం చిత్రపటాన్ని కూడా లోగో‌లో జోడించింది. భారత మ్యాప్ కాషాయం రంగులో కనిపిస్తోంది. బీఎస్ఎన్ఎల్.. కనెక్టింగ్ భారత్.. సురక్షితంగా, చౌకగా, విశ్వసనీయంగా అని ఇంగ్లీష్‌లో క్యాప్షన్ ఇచ్చింది. ఇదివరకు కనెక్టింగ్ ఇండియా ఉండగా ఇప్పుడు దానిని కనెక్టింగ్ భారత్ గా మార్చింది. దేశంలో 5జీ సేవలు ఆవిష్కరణకు ముందు బీఎస్ఎన్ఎల్ ఈ కొత్త లోగోను విడుదల చేసింది.

యూజర్లకు మరింత చేరువవ్వడమే లక్ష్యంగా కొత్త ఫీచర్లను అందించడంపై దృష్టిసారించిన బీఎస్ఎన్ఎల్ 5జీ నెట్‌వర్క్‌ను అందించడానికి సీ-డాక్‌తో (C-DAC) బీఎస్ఎన్ఎల్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీంతో స్వదేశీ సాంకేతికతతో 5జీని అందించేందుకు అడుగులు వేస్తోంది. మరోవైపు డైరెక్ట్-టు-డివైస్ (D2D) కనెక్టివిటీ సొల్యూషన్‌ను కూడా బీఎస్ఎన్ఎల్ మొదలుపెట్టింది. దీని ద్వారా కనెక్టివిటీ లేని మారుమూల ప్రాంతాల్లో కూడా డిజిటల్ చెల్లింపుల కార్యకలాపాలు సాధ్యమవుతాయి. ఇక కొన్ని సర్కిల్స్‌లో ఫ్యాన్సీ నంబర్లను కూడా బీఎస్ఎన్ఎల్ అందుబాటులో ఉంచింది. ఈ-వేలం ద్వారా వాటిని విక్రయించనుంది. స్కామ్‌ల భారీ నుంచి కస్టమర్లకు రక్షణ ఇచ్చేందుకు ఆటోమేటిక్ ఫీల్టర్ లాంటి ఫీచర్లను తీసుకొస్తోంది. ఆటోమేటిక్ ఫీల్టర్ ఫీచర్ ద్వారా అక్కర్లేని మెసేజ్ లను, అనవసర కాల్స్‌ను నిరోధించవచ్చు. వినియోగదారుడి ప్రమేయం లేకుండా నెట్‌వర్క్ స్వయంగా వీటిని నియంత్రిస్తుంది.

అటు ఫైబర్ ఇంటర్నెట్ వినియోగదారుల కోసం వై-ఫై రోమింగ్ సేవను ఆవిష్కరించింది. దీని ద్వారా యూజర్లు అదనపు ఛార్జీలు అవసరం లేకుండానే బీఎస్ఎన్ఎల్ హాట్‌స్పాట్‌లలో హై-స్పీడ్ ఇంటర్నెట్‌ను వినియోగించుకోవచ్చు. తద్వారా డేటా ఖర్చుల భారాన్ని తగ్గించడంలో యూజర్లకు ప్రయోజనం కల్గిస్తోంది. దీనికి తోడు 500లకు పైగా లైవ్ ఛానెల్స్, పే టీవీ ఆప్షన్‌లతో కూడిన కొత్త ఫైబర్ టీవీ సర్వీసును కూడా ప్రకటించింది. ఫైబర్ ఇంటర్నెట్ సబ్‌స్కైబర్లు అందరూ అదనపు ఖర్చు లేకుండా ఈ సర్వీసును ఉపయోగించుకోవచ్చు. అన్నింటికంటే ఎక్కువ ఆకర్షణీయమైన విషయం ఏంటంటే.. టీవీ స్ట్రీమింగ్ కోసం వినియోగించే డేటా నెలవారీ ఇంటర్నెట్ డేటాలో పరిగణలోకి రాదు. మరోవైపు ఆటోమేటెడ్ కియోస్క్‌లను పరిచయం చేయడం ద్వారా సిమ్ కార్డ్‌ల నిర్వహణను మరింత సులభతరం చేయాలని కంపెనీ యోచిస్తోంది. ఈ కియోస్క్‌ల ద్వారా జనాలు బీఎస్‌ఎన్ఎల్ సిమ్ కార్డ్‌లను సులభంగా కొనుగోలు చేయవచ్చు. అంతేకాదు ఈజీగా సిమ్‌లను అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. సిమ్ లను మార్చుకోవడానికి కూడా అవకాశం ఉంటుండటం విశేషం.


Similar News