జమ్మూకశ్మీర్లో మరో ఎన్కౌంటర్.. 3 రోజుల వ్యవధిలో నాలుగోది
గత మూడు రోజుల వ్యవధిలో ఇది నాలుగవ ఎన్కౌంటర్. దోడా జిల్లాలోనే రెండో ఎన్కౌంటర్
దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూకశ్మీర్లో వరుసగా ఉగ్రవాదుల దాడులు, ఎన్కౌంటర్లు కొనసాగుతున్నాయి. తాజాగా బుధవారం సాయంత్రం దోడా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఒక సైనికుడు గాయపడ్డాడు. గత మూడు రోజుల వ్యవధిలో ఇది నాలుగవ ఎన్కౌంటర్. దోడా జిల్లాలోనే రెండో ఎన్కౌంటర్. జూన్ 9న రియాసీలో యాత్రికులపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో పది మంది మరణించారు. దీని తర్వాత మంగళవారం సైతం కథువా ప్రాంతంలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఒక సైనికుడు మరణించగా, ఇద్దరు ఉగ్రవాదుల్ని భద్రతా బలగాలు ఎన్కౌంటర్ చేశాయి. అదేరోజు దోడాలోని ఓ చెక్పోస్టుపై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. దోడా ప్రాంతంలోనే ముగ్గురు నుంచి నలుగురు ఉగ్రవాదులతో కూడిన ఒక బృందం దోడాలోని ఎత్తైన ప్రాంతాలలో ఉన్నట్లు సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. వారిని మట్టుబెట్టడానికి సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం ఇదే ప్రాంతంలో ఎన్కౌంటర్ మొదలైంది. మరోవైపు పూంచ్, రాజౌరి జిల్లాల్లో ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని నిఘావర్గాల నుంచి సమాచారం అందడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి.