లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్.. నిర్వహణకు సిద్ధంగా ఉన్నామన్న ఈసీ

Update: 2024-02-20 14:33 GMT

దిశ, నేషనల్ బ్యూరో: సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు ముహూర్తం ఖరారైనట్టు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ను మార్చి 9వ తేదీ తర్వాత విడుదల చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) సిద్ధమవుతోందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపినట్టు ఓ జాతీయ మీడియా సంస్థ మంగళవారం వెల్లడించింది. సదరు మీడియా కథనం ప్రకారం, ఎన్నికల సంఘం అధికారులంతా లోక్‌సభ ఎన్నికల నిర్వహణ పరిశీలనలకు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. ఇది తుది దశకు చేరుకుంది. ఈ క్రమంలోనే 18వ లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను వచ్చే నెల 9 తర్వాత వెల్లడించనున్నట్టు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. ఏప్రిల్, మే నెలల్లో ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. కాగా, లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ గత శనివారమే వెల్లడించిన విషయం తెలిసిందే.

జమ్మూ కశ్మీర్‌లో నిర్వహణపై చర్చ

జమ్మూ కశ్మీర్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల నిర్వహణ, భద్రతా పరమైన అంశాలపై వచ్చే నెల 8, 9 తేదీల్లో ప్రభుత్వ అధికారులతో ఈసీ చర్చలు జరపనుందని తెలుస్తోంది. 12, 13 తేదీల్లో క్షేత్రస్థాయిలో పరిస్థితులను అంచనా వేసేందుకు ఈసీ అధికారులు జమ్మూ కశ్మీర్‌లో పర్యటించనున్నట్టు సదరు మీడియా సంస్థ వెల్లడించింది. దేశవ్యాప్తంగా లోక్‌సభతోపాటు ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం, జమ్మూ కశ్మీర్‌కు ఎన్నికలు జరగాల్సి ఉంది. గత లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ 2019 మార్చి 10న విడుదలవగా, ఏప్రిల్ 11 నుంచి మే 19 మధ్య ఏడు దశల్లో పోలింగ్ జరిగింది. ఓట్ల లెక్కింపు మే 23న పూర్తయింది.


Tags:    

Similar News