Ram Mohan Naidu: ఏపీలో కొత్త ఎయిర్ పోర్టులపై కేంద్రమంత్రి కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో భేటీ అయ్యారు.

Update: 2024-08-17 12:00 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనల భాగంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఏపీలో విమాశ్రయాల అభివృద్ది, కొత్త ఎయిర్ పోర్టుల పెంపుపై అధికారులతో చర్చించారు. ఈ సమావేశం అనంతరం కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో విమానాశ్రయాల పెంపుపై సీఎం చంద్రబాబు సమీక్ష జరిపారని, ప్రస్తుతం ఉన్న ఏడు విమానాశ్రయాల అభివృద్దితో పాటు మరో 7 కొత్త ఎయిర్ పోర్ట్ లు నిర్మించాలని నిర్ణయించినట్లు తెలిపారు. చిన్న విమానాశ్రయం అభివృద్ది చేయడానికి 500 నుంచి 700 ఎకరాల భూమి అవసరం పడుతుందని, అదే పెద్ద విమానాశ్రయానికి 3 వేల ఎకరాలకు పైగా భూమి కావాల్సి ఉంటుందని అన్నారు. విమానాశ్రయాల అభివృద్దికి ప్రభుత్వం భూమి కేటాయిస్తే.. కేంద్ర ప్రభుత్వం తరుపున సహకారం అందిస్తామని చెప్పారు. శ్రీకాకులం, దస్తగిరి, కుప్పం, నాగార్జున సాగర్ లో విమానాశ్రయాల ఏర్పాటుకు గుర్తించామని, ఈ ప్రాంతాల్లో భూమి, సాంకేతిక అంశాలు పరిశీలిస్తామని అన్నారు.

హెలికాప్టర్ల వినియోగంను పెద్ద ఎత్తున పెంచేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని చంద్రబాబు సూచించినట్లు తెలిపారు. అంతేగాక రాజమహేంద్రవరం, విజయవాడ, కడప విమానాశ్రయాల్లో టెర్మినల్ల సామర్ధ్యం పెంపు పనులపై చర్చ జరిగిందని, నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని, దానిపై సీఎం సూచనలు చేశారని అన్నారు. పుట్టపర్తిలోని ప్రైవేట్ విమానాశ్రయాన్ని ప్రభుత్వ పరం చేసేందుకు నిర్వాహకులతో చర్చించాల్సి ఉందన్నారు. అలాగే ఏపీలో డ్రోన్ల వ్యవస్థను కూడా బాగా అభివృద్ధి చేయాలని నిర్ణయించామని, డ్రోన్లకు సంబంధించి ఒక పెద్ద కార్యక్రమాన్ని అతి త్వరలో ఏపీలో నిర్వహిస్తామని తెలిపారు. అంతేగాక పెద్ద ఎత్తున కోస్తా తీరం అభివృద్ధి జరిగేందుకు అవకాశం ఉందని, దీనిపై భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలని ఏపీ సీఎం సూచించారని అన్నారు. ఇక రాష్ట్రాన్ని లాజిస్టిక్ హబ్ గా చేయడంలో విమానాశ్రయాలు కీలక పాత్ర పోషిస్తాయని, ఏపీని లాజిస్టిక్ హబ్ గా మార్చాలనేదే సీఎం లక్ష్యమని కేంద్రమంత్రి స్పష్టం చేశారు.   

Tags:    

Similar News