JammuKashmir: జమ్మూ కాశ్మీర్ ఎన్నికలకు బీజేపీ ఇన్‌చార్జ్‌ల నియామకం

త్వరలో జమ్మూకాశ్మీర్ లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ అధిష్టానం ఇన్‌చార్జ్‌ లను నియమించింది.

Update: 2024-08-21 06:44 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: త్వరలో జమ్మూకాశ్మీర్ లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ అధిష్టానం ఇన్‌చార్జ్‌ లను నియమించింది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ నాయకులు రామ్‌మాధవ్ లను నియమిస్తూ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర హోదా కోల్పోయి, కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పడ్డాక మొదటిసారి జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను మూడు విడతల్లో జరపనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించి మొదటి సారి జమ్మూ‌కాశ్మీర్ గడ్డపై సొంతంగా బీజేపీ జెండా ఎగరవేయాలని పార్టీ అధిష్టానం నిర్ణయించుకుంది. ఆర్టికట్ 370 రద్దు తర్వాత జరుగుతున్న ఎన్నికల్లో సత్తా చాటి దేశవ్యాప్తంగా బీజేపీ బలాన్ని మరింత పెంచుకోవాలని భావిస్తోంది.

ఈ నేపధ్యంలోనే ఎన్నికల్లో పార్టీ ఇన్‌చార్జ్ లను నియమిస్తూ ఉతర్వులు జారీ చేసింది. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా, కేంద్రమంత్రిగా పనిచేస్తున్న కిషన్‌రెడ్డిని జమ్మూకశ్మీర్‌ ఇన్‌చార్జిగా నియమిస్తూ గత జూన్‌లోనే బీజేపీ నాయకత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఇప్పుడు కిషన్ రెడ్డితో పాటు బీజేపీ మాజీ జాతీయ ప్రధాన కార్యధర్శి రామ్‌మాధవ్ ను కూడా నియమించింది. గత జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో బీజేపీ నేత రామ్‌మాధవ్ ప్రముఖ పాత్ర పోషించారు. 2014 ఎన్నికల్లో పీడిపితో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసే విషయంలో ఆయన కీలకంగా వ్యవహరించారు. దీంతో ఈ ఎన్నికల్లో పార్టీ కిషన్ రెడ్డితో పాటు ఆయనను కూడా ఎన్నికల ఇంచార్జిగా నియమించింది. బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఎన్నికల్లో కిషన్ రెడ్డి, రామ్‌మాధవ్‌లు ఎన్నికల సన్నాహాలు, వ్యూహాలను పర్యవేక్షిస్తారు.  

Tags:    

Similar News