గ్రాంథికానికి పిడుగు.. వ్యవహారికానికి గొడుగు - మన గిడుగు

ఇప్పుడు మనం వార్తాపత్రికలలో, పాఠ్య పుస్తకాలలో చదువుతున్నది

Update: 2023-08-28 19:45 GMT

ఇప్పుడు మనం వార్తాపత్రికలలో, పాఠ్య పుస్తకాలలో చదువుతున్నది, వ్యవహారిక భాషలో మాట్లాడుతున్నది ఒకే రకమైన భాష. కానీ సుమారుగా 1930-40 కాలం వరకు పండితులకు మాత్రమే అర్థమయ్యే రీతిలో గ్రంథాలలో, పాఠ్య పుస్తకాలలో భాష ఉండేది. సామాన్యులకు ఇవి అంతగా అర్థం అయ్యేవి కావు. కావ్యాలు, గ్రంధాలు, పాఠ్యాంశాలు గ్రాంధికభాష నుండి బయటపడి వ్యవహారిక భాషలో రచనారంగం మార్పుకు మూల పురుషుడు గిడుగు రామ్మూర్తి పంతులు గారు. తెలుగులో వాడుక భాషా ఉద్యమ పితామహుడు గిడుగు, గ్రాంథికమ్ము నెత్తిన పిడుగు గిడుగు, వ్యవహార భాషోద్యమ స్థాపక ఘనుడు గిడుగు, తేట తేనియల తెల్లని పాల మీగడ గిడుగు, కూరి తెలుగు భాషకు గొడుగు గిడుగు. ఆంధ్రదేశంలో వ్యావహారిక భాషోద్యమానికి మూలపురుషుడు. బహుభాషా కోవిదుడు. చరిత్రకారుడే గాక చరిత్రను సృష్టించినవాడు.

గిడుగు వారి పుట్టుక శ్రీకాకుళం జిల్లాలోని జీవనది వంశధార ఒడ్డున గల పర్వతాలపేట. దీనికి అవతలి ఒడ్డు ఈ ప్రాంతం వారు దక్షిణ కాశీగా పిలవబడుతూన్న శ్రీముఖలింగం పుణ్యక్షేత్రం. గిడుగు గారు1879 లో మెట్రిక్యులేషన్‌ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యారు.1880లో ముప్ఫై రూపాయల జీతం మీద పర్లాకిమిడి రాజావారి పాఠశాలలో ఫస్టుఫారంలో చరిత్రను బోధించడానికి ఉపాధ్యాయుడిగా కుదిరారు. రాజావారి ఉన్నత పాఠశాల కళాశాల అయిన కారణంగా, అతనికి కళాశాల తరగతులకు పాఠాలు చెప్పే అవకాశం వచ్చింది.

ఇక్కడే 1911 వరకు అనగా 30 యేళ్లు పనిచేసి అధ్యాపకపదవి నుంచి స్వచ్ఛందంగా పదవీవిరమణ చేశారు. అంతకు కొద్ది సంవత్సరాల ముందే ఆధునికాంధ్ర భాషాసంస్కరణ వైపు అతని దృష్టి మళ్ళింది. ప్రజలు వ్యవహరించే భాష పుస్తకాల భాష వేరువేరుగా ఉన్నదని 1907 లో ఉత్తరకోస్తా జిల్లాల పాఠశాల ఇన్స్పె క్టర్గా వచ్చిన జె. ఎ. యెట్స్ అనే బ్రిటిష్ అధికారి చాలా ఆవేదన చెందాడు. ఈ విషయాన్ని ఆయన మూర్తి గారితో చర్చించాడు. విద్యా విధానములో అన్యాయం జరుగుతున్నదని గిడుగు వారు గుర్తించారు. అతను, గురజాడ, శ్రీనివాస అయ్యంగారు, యేట్స్ ఆలోచనల వల్ల వ్యవహారిక భాషా ఉద్యమం పుట్టింది.


తెలుగు భాషలో వచ్చిన చారిత్రాత్మకమైన మార్పుకు ప్రధాన కారణం గిడుగు రామమూర్తి గారి సారధ్యంలో నడిచిన వ్యావహారిక భాష ఉద్యమం లేదా వ్యావహారిక భాషోద్యమం. ఇది ప్రాచీనమైన గ్రాంథిక భాషకు మరియు వ్యావహారిక లేదా వాడుక భాషకు మధ్య జరిగిన భాషా ఉద్యమం.అప్పటి ప్రభుత్వం బోర్డు కార్యదర్శి 1912-13 సం.లో స్కూలుఫైనల్‌లో వ్యాసరచన కావ్యభాషలో గాని ఆధునికభాషలో గాని రాయవచ్చునని ఒక ప్రభుత్వ ఉత్తర్వు (జీ.ఓ.) ఇచ్చాడు. ఆధునిక భాషకు లక్ష్యంగా చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ తెలుగు రీడర్‌ ను, ఏనుగుల వీరాస్వామయ్య రచించిన కాశీయాత్ర చరిత్రను ఉదహరించాడు. ఈ మార్పుల వల్ల తెలుగు సాహిత్యానికి అపకారం జరుగుతుందని పండితుల్లో భయం కలిగింది. మద్రాసులో జయంతి రామయ్య పంతులు అధ్యక్షతన ఆంధ్ర సాహిత్య పరిషత్తు ఏర్పడ్డది. వావిలికొలను సుబ్బారావు, వేదం వేంకటరాయ శాస్త్రి లాంటి పండితులు జయంతి రామయ్య వాదాన్ని బలపరిచారు. దేశం అంతటా సభలు పెట్టి వ్యాసరచన పరీక్షలో ప్రభుత్వం ఇచ్చిన స్వేచ్ఛను ఉపసంహరించాలని పెద్ద ఎత్తున ఉద్యమం లేవదీసారు.

వ్యవహారిక భాషను ప్రతిఘటించిన ఆంధ్ర సాహిత్య పరిషత్తు సభలో (1925, తణుకులో) నాలుగు గంటలపాటు ప్రసంగించి గ్రంథాల్లోని ప్రయోగాల్ని ఎత్తి చూపి తన వాదానికి అనుకూలంగా సమితిని తీర్మానింపజేసాడు గిడుగు. సాహితీ సమితి, నవ్యసాహిత్య పరిషత్తు మొదలైన సంస్థలు కూడా గిడుగు వాదాన్ని బలపరచాయి.గిడుగు రామమూర్తి ఊరూరా ఉపన్యాసాలిస్తూ గ్రాంథికంలో ఏ రచయితా భావాత్మకంగా రాయలేడని నిరూపించాడు. 1919లో గిడుగు తెలుగు అనే మాసపత్రికను స్థాపించి తన శాస్త్రీయ వ్యాసాలతో, ఉపన్యాస పాఠాలతో అవిశ్రాంతంగా పోరాటం సాగించాడు. కాని ఆ పత్రిక ఒక ఏడాది మాత్రమే నడిచింది. చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి, తల్లావజ్ఝుల శివశంకరశాస్త్రి, కందుకూరి వీరేశలింగం, పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి, వజ్ఝల చినసీతారామశాస్త్రి మొదలైన కవులు, పండితులు వ్యావహారిక భాషావాదం వైపు మొగ్గు చూపారు. 1919 ఫిబ్రవరి 28న రాజమహేంద్రవరంలో కందుకూరి వీరేశలింగం అధ్యక్షులుగా, గిడుగు కార్యదర్శిగా వర్తమానాంధ్ర భాషా ప్రవర్తక సమాజం స్థాపించారు.

గిడుగు అనగానే ప్రజలకు స్ఫురించేది వాడుకభాష గురించి చేపట్టిన ఈ మహోద్యమమే. ఈ ఉద్యమం ఫలితంగానే నేడు మనం పాఠశాలల్లో, సమాచార ప్రసారసాధనాల్లో, సాహిత్యంలో మాట్లాడే భాషను ఉపయోగించుకోగలుగుతున్నాం.గ్రాంథికభాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుకభాషలోకి తీసుకు వచ్చి, నిత్య వ్యవహారంలోని భాషలో ఉన్న అందాన్నీ, వీలునూ తెలియజెప్పిన మహనీయుడు. ఇంతే కాక ఆరోజుల్లోనే అతనికి దగ్గర అడవుల్లో ఉండే సవరల భాష నేర్చుకొని వాళ్ళకు చదువు చెప్పాలనే కోరిక కలిగింది. తెలుగు, సవరభాషలు రెండూ వచ్చిన ఒక సవర వ్యవహర్తను ఇంట్లోనే పెట్టుకొని సవర భాష నేర్చుకున్నాడు.సవర దక్షిణ ముండా భాష. సవరభాషా వ్యాకరణాన్ని, సవర-ఇంగ్లీషు కోశాన్ని రచించారు.గిడుగు రామమూర్తి 1940 జనవరి 15వ తేదీన ప్రజామిత్ర కార్యాలయంలో పత్రికాసంపాదకులను సంబోధిస్తూ చేసిన తన తుదివిన్నపంలో వ్యావహారిక భాషా వ్యాప్తికి చాలా సంతృప్తి పొందాడు. కాని, ప్రభుత్వ విద్యాశాఖవారు, విశ్వవిద్యాలయాలు గ్రాంథికాన్ని వదిలిపెట్టక పోవటానికి బాధపడ్డాడు.

ఆ విన్నపంలోని చివరి మాటలు..

దేశభాష ద్వారా విద్య బోధిస్తే కాని ప్రయోజనం లేదు. శిష్టజనవ్యావహారికభాష లోకంలో సదా వినబడుతూంటుంది. అది జీవంతో కలకలలాడుతూ ఉంటుంది. గ్రాంథికభాష గ్రంథాలలో కనబడేదే కాని వినబడేది కాదు. ప్రతిమ వంటిది. ప్రసంగాలలో గ్రాంథికభాష ప్రయోగిస్తూ తిట్టుకొన్నా సరసాలాడుకున్నా ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో చూడండి. గ్రాంథికభాష యెడల నాకు ఆదరము లేకపోలేదు. ప్రాచీనకావ్యాలు చదువవద్దనీ విద్యార్థులకు నేర్పవద్దనీ నేననను. కాని ఆ భాషలో నేడు రచన సాగించడానికి పూనుకోవడం వృథా అంటున్నాను. నిర్దుష్టంగా ఎవరున్ను వ్రాయలేరు. వ్రాసినా వ్రాసేవారికి కష్టమే వినేవారికి కష్టమే. వ్రాసేవాండ్లేమి చేస్తున్నారు భావం తమ సొంత (వాడుక) భాషలో రచించుకొని గ్రాంథికీకరణం చేస్తున్నారు.

అది చదివేవాండ్లు వినేవాండ్లు తమ సొంత వాడుకమాటలలోకి మార్చుకొని అర్థం చేసుకొంటున్నారు. ఎందుకీ వృథాప్రయాస స్వరాజ్యం కావలెనంటున్నాము. ప్రత్యేకాంధ్రరాష్ట్రము కోసం చిక్కుపడుతున్నాము. ప్రజాస్వామిక పరిపాలనం కోరుచున్నాము. ఇటువంటి పరిస్థితులలో మన ప్రజలకు, సామాన్య జనులకు ఏభాష ద్వారా జ్ఞానం కలుగచేయవలసి ఉంటుందో, ఏ భాషలో గ్రంథరచన సాగించవలసి ఉంటుందో ఆలోచించండి. మీచేతులలో పత్రికలున్నవి. పత్రికల ద్వారా మీరు ఎంతైనా చేయగలరు”.అని విన్నవించాడు.

ఇంతటి మహనీయుడు కాబట్టే మనం గిడుగు రామ్మూర్తి జయంతైన ఆగస్ట్ 29 న తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాము. 1934 లో ప్రభుత్వం కైజర్ ఎ హింద్ బిరుదు ఇచ్చి గౌరవించింది. 1913 లో ప్రభుత్వం రావు సాహెబ్ బిరుదు ఇచ్చింది. 1938 లో ఆంధ్ర విశ్వకళాపరిషత్తు కళాప్రపూర్ణతో గౌరవించింది. గిడుగు రామమూర్తి గారికి అభినవ వాగమశాసనుడు అని బిరుదు కూడా ఉంది. 1930 లో ఒడిషా ఏర్పడనున్నప్పుడు, పర్లాకిమిడి రాజా తన పర్లాకిమిడి తాలూకా అంతటిని ఒడిషా రాష్ట్రంలో చేర్పించడానికి ప్రయత్నించినపుడు, తెలుగువారికి నాయకునిగా రామమూర్తి నిలిచి ప్రతిఘటించాడు. ఆ తాలూకాలో చాలా భాగాన్ని, పర్లాకిమిడి పట్టణాన్ని ప్రభుత్వం అక్రమంగా ఒడిషాలో చేర్చడంవల్ల, తెలుగువారికి అన్యాయం జరిగిందని తెలియజేస్తూ అతడు 1936 లో ఒడిషా రాష్ట్ర ప్రారంభోత్సవం జరిగే దినం ఉదయమే పర్లాకిమిడిలో ఉండడానికి ఇష్టపడక, వెంటనే రాజమహేంద్రవరం వచ్చి అక్కడే తన శేషజీవితాన్ని గడిపాడు గిడుగు రామమూర్తి, జనవరి 22, 1940 న కన్ను మూశాడు.

(ఆగస్ట్ 29 తెలుగు భాషా దినోత్సవం)

డి జె మోహన రావు, అధ్యాపకులు

ఆమదాలవలస, శ్రీకాకుళం జిల్లా

ఆంధ్రప్రదేశ్ - 9440485824





Similar News